సిర్గాపూర్, డిసెంబర్ 22 : తెలంగాణ సాధించుకొని ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన చేపట్టాకే గిరిజన బతుకులు మారాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం సిర్గాపూర్లో ఎస్టీ గురుకులం పాఠశాల, కళాశాల నూతన భవన సముదాయాన్ని జడ్పీ చైర్మన్ మంజుశ్రీరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూపాల్రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. గిరిజనులు తమ ఆచార సంప్రదాయ ప్రకారంగా నిండు కలశాలతో ఘన స్వాగతం పలికారు. ఈనేపథ్యంలో మంత్రి నిండు కలశాన్ని ఎత్తుకొని నడిచారు. పాఠశాలకు చెందిన బాలికలు పూలు చల్లుతూ స్వాగతించారు. సభావేదిక ఎదుట స్థానిక గురుకుల బాలికలు తమ గిరిజన సంప్రదాయ నృత్యాలు చేయగా వారితో మంత్రి సత్యవతి, మహిళా సర్పంచ్లు స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు.
అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ గత 70 ఏండ్ల కాలంలో ఏ ప్రభుత్వాలు చేయలేని ప్రజా సంక్షేమాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. కేసీఆర్ సీఎం కావడం గిరిజనులు అదృష్టంగా భావించాలన్నారు. దశాల వారీగా ప్రతి గిరిజన తండా అభివృద్ధి చెందుతుందన్నారు. రోడ్లు, తాగునీరు, సంక్షేమ ఫలాలు, విద్యా, వికా సం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఆమె కొనియాడారు. గతంలో రాష్ట్రం మొత్తం అన్ని కలిపి 276 గురుకులాలు ఉండ గా, తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా అవి ఇప్పుడు 1060 సంఖ్య చేరకుందన్నారు. మారుమూల ప్రాంతంలో విద్యాభివృద్ధి చెందాలని, అందులో గిరిజన విద్యార్థులకు 103 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు.
మరో మూడు గురుకులాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 330 ఆశ్రమ గురుకులాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతి యేటా ఒక్కో విద్యార్థి రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిది చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో టీడబ్ల్యూఈడీ ఎస్సీ జగజ్యోతి, డీఈఈ సత్యానంద్, డీడబ్ల్యూవో పద్మావతి, ఖేడ్ ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, డీఎస్పీ బాలాజీ, ఎంపీపీ మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ రాఘవరెడ్డి, సర్పంచ్ జంగం స్వప్న, ఎంపీటీసీ పీరప్ప, తహసీల్దార్ రత్నం, ఎంపీడీవో సుజాత, స్థానిక ప్రిన్సిపాల్ శ్యామలాదేవి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
సమాజ సంస్కృతి విలువలు గుర్తించాలి : జడ్పీ చైర్పర్సన్
చదువులో కొత్త ఆలోచనలు, సమాజ సంస్కృతి విలువలను వి ద్యార్థులు గుర్తించాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి అన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. విద్యాభ్యాసంతో పాటు జ్ఞాన బోధన, జీవన విధానం, సత్పవర్తన, సమాజంలో జరుగుతన్న విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆమె టీచర్లకు సూచించారు.
రూ.92 కోట్లతో తండాలకు బీటీ రోడ్డు : ఎమ్మెల్యే
నియోజవర్గంలో అన్ని గిరిజన తండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.92 కోట్లు నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తెలిపారు. మంత్రి సత్యవతి కృషితో ఈ పాటికే రూ.56 కోట్లు తండాలకు బీటీ రోడ్లు మంజూరైందని, దీంట్లో రూ.36 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషితో నియోజవర్గంలో నాలుగు ఎస్టీ గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. 54 గిరిజన తండాలను ప్రత్యేక జీపీలుగా ఏర్పాటు చేశామని, ఒక్కో జీపీ భవ నం కోసం రూ.20 లక్ష నిధులు మంజురైనట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.5కోట్లతో తండాల్లో త్రీఫేజ్ కరెంటు సరఫరా చేపట్టామన్నారు. ప్రతి తండాలో వాటర్ ట్యాంక్, ఇంటింటికీ నల్లా సౌకర్యాన్ని రూ. 88 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రతి తండా అభివృద్ధి చెందిందన్నారు.