అక్కన్నపేట, మార్చి 12: కాంగ్రెస్ పాలనలో కరువు తాండవం చేస్తోంది. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ రైతును కదిలించినా క‘న్నీళ’్ల ముచ్చటనే చెప్పుతున్నారు. అడుగంటిన భూగర్భ జలాలు, వచ్చిపోయే దొంగ కరెంటు, ఎండుతున్న పంట చేన్లతో రైతులు అరిగోస పడుతున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేటకు చెందిన అల్లాడి సంపత్ ఆలియాస్ సోమ సంపత్ రెండు ఎకరాల్లో వరి సాగుచేశాడు. పొలమంతా నీళ్లందక ఎండిపోయింది. దీంతో గొర్రెల కాపరులు ఎండిన వరిచేన్లలో గొర్రెల మందలను మేపుతున్నారు. 1.06లక్షల ఎకరాలకు సాగునీరందించేలా అక్కన్నపేట మండలంలో కేసీఆర్ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది.
బీఆర్ఎస్ హయాంలో దాదాపు 95శాతం పనులు పూర్తిచేసి ప్రాజెక్టు ట్రయల్న్ చేయగా విజయవంతమైంది. ప్రాజెక్ట్టులో 1.5 టీఎంసీల గోదావరి జలాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు తుదిదశ పనులపై దృష్టిసారిస్తే ప్రాజెక్టులోని నీళ్లు కాల్వల్లో పారేవి. పదేండ్ల నుంచి పచ్చగా ఉన్న పొలాలు ఎండిపోతూ ప్రస్తుతం బీడు భూములుగా మారుతున్నాయి. తలాపున పెద్ద ప్రాజెక్టు ఉన్నా లేనట్టుగానే అయిపోయింది. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర రవాణాశాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్కు మాత్రం ఈ ప్రాజెక్టుపై పట్టింపు లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.