సంగారెడ్డి, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): మెదక్ ఎంపీ టికెట్ కేటాయింపుతో కాంగ్రెస్లో మొదలైన రచ్చ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ను గెలిపించాలని పట్టుదలగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి అందరూ నాయకులను ఏకతాటి మీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం ప్రయత్నాలు కలిసి రాకపోగా బెడిసి కొడుతున్నట్లు కనిపిస్తోంది. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, పటాన్చెరు కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్గౌడ్ ఇద్దరినీ కలపాలన్న రేవంత్రెడ్డి వ్యూహం ఫలించే సూచనలు కనిపించడం లేదు. సీఎం ఒత్తిడి మేరకు కాటా శ్రీనివాస్గౌడ్ తప్పనిసరి పరిస్థితుల్లో నీలం మధును కలిశారు. ఎన్నికల్లో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు. వాస్తవంగా కాటా శ్రీనివాస్గౌడ్తో పాటు ఆయన మద్దతుదారులు నీలం మధుతో కలిసి ఎంపీ ఎన్నికల్లో పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలం మధు, కాటా శ్రీనివాస్గౌడ్ మధ్య పొరపొచ్చాలు నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాటా శ్రీనివాస్గౌడ్ను కాదని కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ నుంచి వచ్చిన నీలం మధుకు పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
ఇది నచ్చని కాటా శ్రీనివాస్గౌడ్ ఆందోళనకు దిగారు. ఆప్పట్లో ఆయన భార్య కాటా సుధారాణి కాంగ్రెస్ అధిష్టానం, నీలం మధుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విడుదల చేసిన వీడియో సంచలనం రేపింది. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ ఒత్తిడితో కాంగ్రెస్ అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి ఎమ్మెల్యే టికెట్ను కాటా శ్రీనివాస్గౌడ్కు కేటాయించింది. తనకు ప్రకటించిన ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా చేసిన కాటా శ్రీనివాస్గౌడ్ను ఎన్నికల్లో ఓడించి తాను గెలుస్తానని నీలం మధు సవాలు చేశారు. కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్గౌడ్ పోటీచేస్తే నీలం మధు బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. నామినేషన్లు వేసింది మొదలు ఎన్నికల ప్రచారం ముగిసే వరుకు ఇద్దరు పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఓటమి పాలైనప్పటికీ ఇద్దరి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. కాగా, ఎంపీ ఎన్నికలకు ముందు నీలం మధు తిరిగి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ అధిష్టానం సీనియర్లను పక్కనబెట్టి నీలం మధుకు మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇది పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన కాటా శ్రీనివాస్గౌడ్కు మింగుడు పడలేదు. తన ఓటమికి కారణమైన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇస్తారా అని ఆగ్రహంతో ఉన్న ఆయన మధుతో కలిసి పనిచేసేందుకు ససేమిరా అన్నారు. దీంతో స్వయంగా సీఎం రేవంత్రెడ్డి కలుగజేసుకుని రెండు రోజుల క్రితం ఇద్దరినీ కలిపారు.
మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి కొండా సురేఖ ఎదుటే నీలం మధుతో కలిసి పనిచేసేందుకు కాటా శ్రీనివాస్గౌడ్ ఆయన మద్దతుదారులు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. బుధవారం నీలం మధును వెంటబెట్టుకుని మంత్రి కొండా సురేఖ రామచంద్రాపురంలోని కాటా శ్రీనివాస్గౌడ్ ఇంటికి వచ్చింది. ఈ సందర్భంగా నీలం మధు, కాటా శ్రీనివాగౌడ్ ఇద్దరినీ కలిసి పనిచేయాల్సిందిగా మంత్రి నచ్చజెప్పారు. సీఎం ఒత్తిడి మేరకు నీలం మధుతో చేతులు కలిపినప్పటికీ కాటా శ్రీనివాస్గౌడ్ మాత్రం తాను ఎన్నికల్లో పనిచేయలేనని కొండా సురేఖకు ప్రైవేటుగా చెప్పినట్లు తెలుస్తుంది. తనను వ్యక్తిగతంగా దూషించి తన ఓటమికి కారణమైన నీలం మధుతో కలిసి పనిచేసేది లేదని, తన మద్దతుదారులు సైతం ఒప్పుకోవడం లేదని కాటా శ్రీనివాస్గౌడ్ మంత్రి సురేఖకు వివరించినట్లు తెలుస్తుంది. కాటా శ్రీనివాస్గౌడ్ భార్య సైతం మంత్రి సురేఖ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో గురువారం వైరల్ అయ్యింది. కాటా శ్రీనివాస్గౌడ్ భార్య కాటా సుధారాణి నీలం మధుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నా భర్తను ఎన్నికల సమయంలో వ్యక్తిగతంగా దూషించాడు.. అనరాని మాటలు అన్నాడు.. ఇప్పుడు ఎలా క్షమించి పనిచేస్తాము.. మీరు ఏమి అనుకోకండా ఆయన అన్న మాటలకు చెంప పగులగొట్టాలని ఉంది అన్నారు’. ఈ వీడియో వైరల్ కావడంతో పాటు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాటా శ్రీనివాస్గౌడ్ మద్దతుదారులు ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు. కాగా, కాటా సుధారాణి సైతం మంత్రి సురేఖ వినతి మేరకు నీలం మధును క్షమించి బొట్టుపెట్టి దీవించిందని నీలం మధు మద్దతుదారులు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు కాటా సుధారాణి బొట్టుపెడుతున్న వీడియోను సోషల్ మీడియాలో వాళ్లు పోస్టు చేశారు.