జహీరాబాద్, మే 8: కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. 10న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలతోపాటు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించారు. బీజేపీ గెలుపు కోసం ప్రధానమంత్రి మోదీ, అమిషా, జేపీ నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రోడ్ షోలు నిర్వహించి ప్రచారం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రచారం నిర్వహించి ఓటర్లుకు పార్టీపై విశ్వాసాన్ని కల్పించారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కర్ణాటక ఎన్నికలు ఎంత కీలకమో ప్రచారం ద్వారా తెలిసింది. జేడీఎస్ తరఫున మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ నేత కుమార స్వామి ప్రచారం చేశారు. 13న ఓట్ల లెక్కింపు చేస్తారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముగియడంతో ఓటర్లను నేరుగా ఇంటింటికి వెళ్లి కలుస్తున్నారు.
కర్ణాటకలో ప్రచారం.. జహీరాబాద్ లాడ్జిల్లో విశ్రాంతి
జహీరాబాద్కు సమీపంలో బీదర్, కలబుర్గా జిల్లాల సరిహద్దుగా ఉంది. దీంతో ప్రధాన పార్టీల నాయకులు బీదర్ జిల్లాలోని హుమ్నాబాద్, బీదర్, బీదర్ దక్షిణ, బసవకల్యాణ్, చించొళి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసి ఇక్కడికి వస్తున్నారు. జహీరాబాద్ పట్టణం 65వ జాతీయ రహదారిపై ఉండడంతో ఎక్కవగా లాడ్జీలు, దాబాహోటళ్లు ఉన్నాయి. మంచి భోజనం, రాత్రి పడుకొనేందుకు లాడ్జీలు ఉండడంతో ఎక్కువ మంది వస్తున్నారు. రాత్రి కాగానే జహీరాబాద్ లాడ్జీలు, హోటళ్లు కర్ణాటక నాయకులతో నిండిపోతున్నాయి. ఎక్కడ చూసినా శాసన సభ ఎన్నికలపై మాట్లాడుకోవడం కనిపిస్తున్నది. కొందరు ఎన్నికల సర్వే చేసేందుకు వచ్చిన వారు జహీరాబాద్లో ఉండి వెళ్తున్నారు.
రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం…
కర్ణాటకకు సరిహద్దులో న్యాల్కల్, కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాలు ఉన్నాయి. బీదర్ జిల్లాకు సరిహద్దులో న్యాల్కల్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాలు ఉన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖ, వ్యవసాయ, ఫారెస్టు అధికారులు జాతీయ రహదారిపై ఉమ్మడి చెక్పోస్టు ఏర్పాటు చేశారు. 65వ జాతీయ రహదారిపై చెరాగ్పల్లి శివారులో మాడ్గి చౌరస్తా వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. న్యాల్కల్ మండలం హుసేనగర్, మాల్గి, వడ్డీ, జహీరాబాద్-బీదర్ రోడ్డుపై గణేశ్పూర్, రాజోల శివారులో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
జహీరాబాద్ మండలం బుచెనెల్లి శివారులో రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. మొగుడంపల్లి మండలంలోని రాష్ట్ర సరిహద్దులో గౌసాబాద్ తండా సమీపంలో చెక్పోస్టు ఏర్పాటు చేశారు. కోహీర్ మండలం మానియర్పల్లి శివారు చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. మద్యం, డబ్బులు కర్ణాటక వైపు తరలకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జాతీయ రహదారితోపాటు ఇతరు రోడ్ల వెంట మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికలు ముగిసే వరకు చెక్పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు.