రెండో విడత కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మర్కూక్ మండలం అంగడి కిష్టాపూర్లో అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జడ్పీ చైర్పర్సన్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎఫ్డీసీ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు శిబిరాలను ప్రారంభించారు. తొలిరోజు శిబిరాలకు ప్రజలు పోటెత్తారు. సాయంత్రం 4గంటలకు శిబిరాలు ముగియాల్సి ఉన్నప్పటికీ, వచ్చిన వారందరికీ పరీక్షలు పూర్తిచేసి శిబిరాలను బంద్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
సిద్దిపేట, జనవరి 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెండో విడత కంటివెలుగు కార్యక్రమం సిద్దిపేట జిల్లాలో గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. జిల్లాలో 45 బృందాలు ఏర్పాటు చేసి తొలిరోజు 5,142 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. వీరిలో పురుషులు 2,422 మంది, స్త్రీలు 2,720 మంది ఉన్నారు. 1,256 మందికి కంటి అద్దాలు (రీడింగ్) అందజేశారు.1,019 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ ఇచ్చామని డీఎంహెచ్వో కాశీనాథం తెలిపారు. రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మర్కూక్ మండలం అంగడి కిష్టాపూర్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డీఎంహెచ్వో కాశీనాథం, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, కంటి వెలుగు రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ శ్రీదేవితో కలిసి ప్రారంభించారు.
కుకునూరుపల్లి, కొండపాక మండల కేంద్రాలతో పాటు సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ సందర్శించారు. సిద్దిపేట నర్సాపూర్ శాలివాహన కుమ్మరి సంఘంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి కలెక్టర్ సందర్శించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చిన్ననిజాంపేటలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ చిన్నకోడూరు, ఇబ్రహీంనగర్లో అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్తో కలిసి శిబిరాలను ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఫారూఖ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు దుబ్బాక మండలంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి వర్గల్ మండలం అంబర్పేటలో, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ బెజ్జంకిలో, మద్దూరు మండలంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, హుస్నాబాద్ మండలంలోని బల్లునాయక్ తండాలో ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్లు శిబిరాలను ప్రారంభించారు.
మురిసిన పేదలు…
ఆయా గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఏర్పాటు చేసిన శిబిరాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రారంభించారు. శిబిరాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు శిబిరాలు ముగియాల్సి ఉన్నప్పటికీ, వచ్చిన వారందరికీ పరీక్షలు పూర్తయ్యాకే తొలిరోజు శిబిరాలను బంద్ చేశారు. నేత్ర పరీక్షల నిర్వహించి వివరాలు వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. తమ ఊరు, వార్డుకే వైద్యబృందాలు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, అద్దాలు అందివ్వడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్థిక స్తోమత సరిగా లేక కంటి పరీక్షలు చేయించుకోలేక సతమతం అవుతున్న వారికి కంటివెలుగు కార్యక్రమం వరంలా మారింది. శిబిరాల వద్ద యువకులతో పాటు వృద్ధులు ఉత్సాహంగా వచ్చి నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. అద్దాలు, మందు లు అందుకున్నవారు వాటిని చూస్తూ మురిసిపోయారు. తమ కంటి సమస్యలను పరిష్కరిస్తున్న సీఎం కేసీఆర్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.