సదాశివపేట, మార్చి 23: అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట 8వ వార్డులో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని గురువారం చింతా ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. ప్రతిఒక్కరూ కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఎలాంటి కష్టం రావద్దన్న ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. శిబిరంలో వైద్యులతో మాట్లాడి పలు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు వడ్ల మహేశ్వరి, శ్రీశైలం, విద్యాసాగర్రెడ్డి, చౌదరి ప్రకాశ్, మోబిన్, గుండు రవి, కోడూరి అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు చీల మల్లన్న, వీరేశం పాల్గొన్నారు.
సంగరెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి, మార్చి 23: జిల్లాలో ఏర్పాటు చేసిన 66 కంటి వెలుగు శిబిరాల్లో 16,333 మందికి కంటి పరీక్షలు చేశారు. 736 మందికి రీడింగ్ అద్దాలు, సాధారణ చూపునకు అవసరమున్న వారికి 653 మందికి అద్దాలు అందజేశారు. ఆపరేషన్లు అవసరమున్న 1074 మందికి ఇతర దవాఖానలకు పంపించారు.
మెదక్ జిల్లాలో..
మెదక్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 43 రోజు ల్లో 2.50 లక్షల మందికి కంటి పరీక్షలు చేశారు. ఇం దులో పురుషులు 1,18,655 మంది, మహిళలు 1,31,780 మంది ఉన్నారు. ఇప్పటివరకు 26,443 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 25వేల మందికి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. గురువారం జిల్లాలో 35 బృందాలు 5502 మందికి కంటి పరీక్షలు నిర్వహించాయి. 525 మందికి కండ్లద్దాలు పంపి ణీ చేశారు. 498 మందికి అద్దాలకు ఆర్డరిచ్చారు. జిల్లా వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు శిబిరాల వద్ద ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్వో చందునాయక్ అన్నారు.