సంగారెడ్డి/ మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13: కంటి సమస్యలతో బాధపడుతున్నవారు కంటి వెలుగుతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా కంటి సమస్యలు దూరమవుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన వారికి కండ్లద్దాలు అందజేస్తుండడంతో కండ్ల జోళ్లు ధరించిన వారు మురిసిపోతున్నారు. కంటి చూపు సరిగా కనిపించక ఇబ్బందులు పడుతున్న మాకు కంటి వెలుగు కార్యక్రమంతో తమ జీవితాల్లో వెలుగు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని దీవెనార్తులిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 17396 మందికి పరీక్షలు
రెండో విడత కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం సంగారెడ్డి జిల్లాలో 17396 మందికి కంటి పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 66 కంటివెలుగు చికిత్స శిబిరాల్లో ప్రజలు కండ్ల పరీక్షలు చేసుకునేందుకు బారులుతీరారు. ఇందులో 3859 మందికి ప్రత్యేక ఆపరేషన్లకు గాను ఇతర దవాఖానలకు ప్రతిప్రాదించారు. సాధారణ అద్దాలు అవసరమున్న 1263 మందికి అధికారులు పంపిణీ చేశారు. చదువుకునేందుకు వీలుగా అద్దాల కోసం 1024 మందిని గుర్తించిన కంటివైద్య నిపుణులు అద్దాలు అందజేశారు.
మెదక్ జిల్లాలో 6174 మందికి పరీక్షలు
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. 36 రోజులుగా జిల్లాలో 2,10,321 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 99,908 మంది పురుషులు, 1,10413 మంది మహిళలున్నారు. 22,876 మందికి కంటి అద్దాలు అందజేయగా, 21,695 మంది అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు. సోమవారం జిల్లాలో 37 వైద్య శిబిరాల ద్వారా 6,174 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 631 మంది కంటి అద్దాలు అందజేశారు. 688 మంది అద్దాలకు ఆర్డర్లు ఇచ్చినట్లు డీఎంహెచ్వో చందూనాయక్ తెలిపారు.