సిద్దిపేట, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/తొగుట: సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు తరలివస్తుండడంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలోని అన్ని రిజర్వాయర్లను కాళేశ్వర జలాలతో నింపుతున్నారు. దీంతో సాగునీటికి ఢోకా ఉండదు. భూగర్భ జలాలు పెరగనున్నాయి.రైతులు ధీమాగా పంటలు సాగుచేసుకోవచ్చు.
సిద్దిపేట జిల్లాలో బహుళ ప్రయోజనాలు కలిగిన కొమురవెల్లి మల్లన్నసాగర్కు కాళేశ్వర జలాలు తరలివస్తున్నాయి. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్ధ్యం 50 టీఎంసీలు. గురువారం అధికారులు నాలుగు పంపులు ఆన్చేసి మల్లన్నసాగర్లోకి నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారు. సరాసరిగా ఒక పంపు 24గంటల పాటు నడిస్తే 0.25 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తుంది. అలాగే గురువారం రంగనాయక సాగర్లోకి ఒక పంపు ద్వారా 6 గంటల పాటు నీటిని ఎత్తిపోశారు. అనంతరం పంప్ను బంద్ చేసినట్లు అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్నపూర్ణ (అనంతగిరి పోచమ్మ సాగర్) నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్లోకి పంప్ల ద్వారా గోదావరి జలాలు వస్తున్నాయి. రంగనాయక సాగర్ ప్రధాన కాల్వ ద్వారా తుక్కాపూర్(మల్లన్నసాగర్) పంప్హౌస్కు నీళ్లు వెళ్తున్నాయి. మల్లన్నసాగర్లోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నారు. ఒక్కో పంపు నుంచి 1300 క్యూసెక్కులు నీళ్లు వస్తున్నాయి. ఒక్క రోజులో ఏకధాటిగా నడిస్తే నాలుగు పంపులకు 0.4 టీఎంసీల నీళ్లు వస్తాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.28 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ సామర్ధ్యం 3 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.77 టీఎంసీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ సామర్ధ్యం 50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 11 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్కు కాళేశ్వర జలాలు వస్తాయి. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లకు గోదావరి జలాలు వస్తాయి.
బహుళ ప్రయోజనాలతో నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయంలోకి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నీటిని నింపలేదు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్ధ్యం 50 టీఎంసీలు కాగా, దశల వారీగా పూర్తి సామర్ధ్యం నింపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత వేసవిలో మల్లన్నసాగర్ రిజర్వాయర్లో 16 టీఎంసీల వరకు నీటి నిలువ ఉంచారు. రిజర్వాయర్లో నీటిమట్టాన్ని దశల వారీగా పెంచుతున్నారు. ప్రస్తుతం పది రోజుల పాటు పంపులు నడిపి 15 నుంచి 16 టీఎంసీల వరకు నీటిని నింపాలని నిర్ణయించినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ వేణు తెలిపారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీటితో గడిచిన ఎండాకాలంలో మల్లన్నసాగర్ ప్రధాన కాలువ ద్వారా, అలాగే కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా చెరువులు, కుంటలకు, కూడవెల్లి, హల్దీవాగులకు నీటిని విడుదల చేసి వేలాది ఎకరాల్లో పంటలను కాపాడారు. ఆ నీళ్లే లేకపోతే పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయేవారు. ప్రస్తుతం పడుతున్న వర్షాలకు తోడు కాళేశ్వర జలాలు వస్తుండడంతో చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు జలకళను సంతరించుకున్నాయి. త్వరలోనే మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేస్తారు. మల్లన్న సాగర్లోకి నీటిని ఎత్తిపోస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు ఢోకాలేదని రైతులు పేర్కొంటున్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ వద్దకు పర్యాటకులు తరలివస్తున్నారు. గురువారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు రైతులు వచ్చి తిలకించారు. నీటి విడుదల కార్యక్రమంలో ఈఈ వెంకటేశ్వర్రావు, ఈఈ సాయిబాబా, డీఈలు శ్రీనివాస్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
సమైక్య పాలనలో కరువు కాటకాలు.. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు.. సాగు,తాగునీటికి గోస.. రైతు ఆత్మహత్యలు.. వలసలకు నెలవుగా మారి కన్నీరు పెట్టింది మెతుకుసీమ. ఇప్పుడు సమైక్య పాలనలో సుభిక్షంగా మారింది. ఎటుచూసినా పుష్కలంగా జలాలు, పచ్చని పంటలతో సస్యశ్యామలంగా మారి జిల్లా అలరారుతున్నది. బీఆర్ఎస్ కృషితో జిల్లాలో సాగునీటి వసతి పెరిగి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. భూమికి బరువయ్యేలా వరి పండుతున్నది. రైతు ఆత్మహత్యలు తగ్గాయి. గుంట జాగ ఖాళీ లేకుండా రైతులు పంటలు పండిస్తున్నారు. వ్యవసాయం మంచిగా సాగుతుండడంతో పల్లెలు కళకళలాడుతున్నాయి. రైతులు, రైతు కూలీలకు ఉపాధి లభిస్తున్నది. ఇప్పుడు ఇతర ప్రాంతాల వారే ఇక్కడికి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. స్వరాష్ట్రంలో జిల్లా బంగారు తునకలా మారుతున్నది. ఈ ఫొటోల కనిపిస్తున్న పచ్చని వరి పొలాలు, మధ్యలో నుంచి వెళ్తున్న రోడ్డు.. ఈ అందమైన దృశ్యం కొల్చారం మండలం రాంపూర్ శివారులో ‘నమస్తే తెలంగాణ’ కెమెరా కంటికి చిక్కింది.
-మెదక్ ఫొటోగ్రాఫర్, సెప్టెంబర్ 7
వర్గల్, సెస్టెంబర్ 7 : మర్కూక్ మండలం పాముపర్తి వద్దగల కొండపోచమ్మ సాగర్ నుంచి గురువారం ఇరిగేషన్శాఖ అధికారులు కాల్వలోకి నీటిని విడుదల చేశారు. దీంతో వర్గల్ మండలం నగరంతండా వద్దగల సంగారెడ్డి లింక్ కాల్వ తూం నుంచి చౌదర్పల్లి బంధంచెరువులోకి గోదావరి జలాలు చేరుకుంటున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడుగా కొండపోచమ్మసాగర్ నీళ్లు కూడా జతకావడంతో రామాయంపేట కాల్వ, సంగారెడ్డి కాల్వలు జలకళతో నిండిపోయాయి.
మర్కూక్, సెప్టెంబర్ 7 : మండంలంలోని సీఎం దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్యగల చెక్డ్యామ్ నుంచి వరదనీరు పరవళ్లు తొక్కుతున్నది. వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు చెక్డ్యామ్లు నిండి దిగువ ప్రాంతానికి వెళ్తున్నాయి.