అక్కన్నపేట, జూలై 15 : గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని, అన్ని విధాల బెనిఫిట్స్ అందిస్తామని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్ట్ రీడిజైన్లో భాగంగా ముంపునకు గురవుతున్న గూడాటిపల్లి గ్రామ పరిధిలోని చింతల్తండా, సేవ్యనాయక్తండా, జాలుబాయ్తండా, తిరుమల్తండా, బోండ్యతండాల్లో వేర్వేరుగా శుక్రవారం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ గ్రామ సభలు నిర్వహించారు. ఆయా సభల్లో అడిషనల్ కలెక్టర్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అంశంపై భూ నిర్వాసితులతో చర్చించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఇవ్వాలని, నేటి వరకు మేజర్లందరికి ప్యాకేజీ వర్తింపజేయాలని నిర్వాసితులు కోరారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఆర్అండ్ఆర్ కింద ప్రతి కుటుంబానికి, 18ఏండ్లు నిండిన వారికి కలిపి రూ.6.36 లక్షలు, ఐఏవై కింద రూ.1.25 లక్షలు, 60 గజాల ఇంటి స్థలం ఇయ్యాల్సి ఉంటుందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల పక్షాన ఆలోచించి, బెస్ట్ పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇదే అంశంపై మంత్రి హరీశ్రావు, కలెక్టర్తో సమావేశం జరిగిందని వివరించారు.
మలన్నసాగర్ ప్రాజెక్ట్లో ఆర్అండ్ఆర్ కింద ప్రతీ కుటుంబానికి రూ.12.54లక్షలు, 250గజాల ఇంటి స్థలం, మేజర్లకు రూ.5లక్షలు, 250 గజాల ఇంటి స్థలం ఇచ్చామన్నారు. మల్లన్నసాగర్ తరహాలో పరిహారం కావాలా? లేక కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం పరిహారం కావాలా? అనేది ఆలోచించాలన్నారు. తుది నిర్ణయం నిర్వాసితులదేనన్నారు. ఇదే మండలంలోని నందారం క్రాస్ రోడ్డు వద్ద సర్వే నెం. 173లో పునరావాసం కింద 250 గజాల ఇండ్ల స్థలాలను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తామన్నారు. ఇండ్ల స్థలాల వద్ద రోడ్లు, బడి, గుడి, విద్యు త్, తాగునీరు, అండర్ డ్రైనేజీ, ఇతరత్రా సౌకర్యాలను కల్పిస్తామన్నారు. 2017 నాటి మేజర్లకే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తిస్తుందని సృష్టం చేశారు. రీడిజైన్ నోటిఫికేషన్ నుంచి ఇప్పటి వరకు మేజర్లకు ప్యాకేజీ వర్తింపు విషయంలో హామీ ఇవ్వలేమని, ప్రభుత్వానికి ఈ అంశాన్ని నివేదిస్తామన్నారు. ప్రాజెక్ట్కు సరిపోగా మిగులు రైతు భూములకు సంబంధించి కొత్త పాస్బుక్కులను త్వరలో నిర్వాసితులకు అందజేస్తామన్నారు. 2015 డ్రాఫ్ట్ పబ్లిష్ నాటికి నిర్వాసితుడు బతికి ఉండి, తర్వాత చనిపోతే వారి వారసులకు పరిహారం అందిస్తామన్నారు. ప్రాజెక్ట్ పైన సాగు భూముల కోసం కొత్తగా విద్యుత్ లైన్లు, స్తంభాలు, ఇతరత్ర వాటి కోసం రూ.56 లక్షలు మంజూరు కాగా, విద్యుత్ శాఖకు ఇచ్చామన్నారు.
ఆర్అండ్ఆర్ జాబితాలో తప్పిపోయిన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే, పరిశీలించి విచారణ చేసి, అర్హులైతే జాబితాలో చేరుస్తామన్నారు. ఈ సమావేశంలో హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఎం పీపీ మాలోతు లక్ష్మీబీలునాయక్, తహసీల్దార్ సంజీవ్కుమార్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, సర్పంచ్ బద్దం రాజిరెడ్డి, ఎంపీటీసీ బైరి రవి, భూ నిర్వాసితులు పాల్గొన్నారు. కాగా, ఈ ఐదు తండాల పరిధిలో సుమారు 187 కుటుంబాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తించనున్నది.