న్యూఢిల్లీ: పలు ప్రశ్న పత్రాల లీకేజీతో అభాసుపాలైన కేంద్రం నీట్-పీజీ 2026లో కీలక సంస్కరణలు అమలు చేయనున్నట్టు ప్రకటించింది. పరీక్ష ప్రక్రియ, భద్రత చర్యలు, కేంద్రాల కేటాయింపు అభ్యర్థులకు సౌకర్యవంతంగా ఉండేలా చేస్తున్నట్టు తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. నీట్-పీజీని ఒక షిఫ్ట్లోనే నిర్వహిస్తారు. తద్వారా ప్రశ్నపత్రం కఠినత్వ స్థాయిలో ఏకరూపతను, మదింపు పక్రియలో పారదర్శకతను తీసుకొస్తారు. అభ్యర్థులందరూ ఒకే ప్రశ్నపత్రానికి జవాబులు రాసేలా చేస్తారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నీట్-పీజీ సన్నద్ధతపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతిక విధానంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కీలక సంస్కరణల ప్రకారం.. అభ్యర్థులు తమ దరఖాస్తులో మూడు పరీక్ష కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాన్ని కల్పించారు.
వారి నివాస ప్రాంతానికి దగ్గరగా పరీక్ష కేంద్రాన్ని కేటాయించేందుకు వీలుగా వారి సంప్రదింపుల చిరునామా ఉన్న రాష్ర్టాన్ని తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యతగా పరిగణిస్తారు. పరీక్ష జరిగే ఆగస్ట్ 30కి మూడు వారాల ముందే పరీక్ష రాసే నగరం గురించి అభ్యర్థులకు సమాచారం అందిస్తారు. పరీక్షలో ప్రశ్నలను 200 నుంచి 180కి తగ్గించారు. ప్రశ్నపత్రం తయారీ, పంపిణీ, పరీక్ష ప్రారంభంలో పలు స్థాయిల్లో రహస్య సంకేతాలను ఉపయోగిస్తారు. పరీక్షకు కొద్ది సేపటి ముందు ప్రశ్నపత్రాలను ఖరారు చేస్తారు. ఆధార్ ఆధారిత ధ్రువీకరణను దరఖాస్తు సమయంలో, పరీక్ష సమయంలో అమలు చేస్తారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం, దళారుల ప్రమేయం లాంటి అనుచిత ప్రయత్నాలపై ఫిర్యాదు చేయడానికి ఒక ఈ-మెయిల్ చిరునామాను కేటాయించారు.
వైద్య విద్య కౌన్సెలింగ్ సులభతరం
ఎంబీబీఎస్ ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఆల్ ఇండియా కోటా(ఏఐక్యూ)లో జరిగే ప్రవేశాల్లో పలు మార్పులను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రవేశపెట్టింది. సీటు కేటాయించబడి తదుపరి రౌండ్లలో అప్గ్రేడ్ కోసం ఆప్షన్ ఇచ్చిన అభ్యర్థులు ఇకపై తమకు కేటాయించిన కళాశాలల్లో ప్రవేశ పక్రియను పూర్తి చేయడానికి భౌతికంగా హాజరు కానవసరం లేదు. డీమ్డ్ యూనివర్సిటీల్లో ఎన్నారై రిజర్వేషన్ సీట్లు పొందాలనుకొనేవారు కౌన్సెలింగ్ పోర్టల్లో తమ పత్రాలను అప్లోడ్ చేయవచ్చు.