గజ్వేల్, ఆగస్టు 2: రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే పాలన సాగాలని, మాల అనుబంధ కులాల హక్కులకు భంగం కలిగే నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని ఎమ్మె ల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ భవనం వద్ద మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తుమ్మ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించిన అనంతరం మాట్లాడారు.
బాధితుల ఆందోళనను దృష్టి లో పెట్టుకొని న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అనంతరం మాల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్, తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుంగలో తొక్కి, ఎస్సీ వర్గీకరణ చట్టం, రోస్టర్ విధానం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాల, అనుబంధ కులాలకు తీవ్ర అన్యా యం చేస్తున్నాయని మండిపడ్డారు.
సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ జీవోలు, చట్టాలు సవరించాలన్నారు. మాల, అనుబంధ కులాలకు దెబ్బతీస్తున్న రోస్టర్ పాయింట్ విధానాన్ని పునఃసమీక్షించి న్యాయం చేయాలన్నారు. ఉపకులాల ప్రయోజనాలు కాపాడే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్సీవర్గీకరణ విధానం, రోస్టర్ పాయింట్స్లో మాలలకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గౌరవ చైర్మన్ రామచంద్రం, సేవురి ప్రణయ్, బాలకిషన్, రాహుల్, భానుతేజ, సైదులు, గాలెంక శ్రీను, బైరం శివకుమార్, దేవేందర్, చిప్పల యాదగిరి, నీరుడి స్వామి, కృపానందం, భాస్కర్, రాజు, ప్రేమ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.