శాసనసభ ఎన్నికల ఫలితాలు గులాబీ శ్రేణుల్లో జోష్ను నింపాయి. మెతుకు సీమలో గులాబీ గుబాళించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో సంబురాలు అంబరాన్నంటాయి. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.స్వీట్లు పంపిణీ చేసి ఆనందం పంచుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది.
హత్నూర, డిసెంబర్ 3 : నర్సాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. హత్నూర మండలంలో సునీతారెడ్డి విజయంపై బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద పటాకులు కాల్చుతూ స్వీట్లు పంచుకుంటూ ర్యాలీలు నిర్వహిస్తూ సంబురాలు నిర్వహించారు. సంబురాల్లో ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.