నర్సాపూర్, నవంబర్3: ఇసుక వేస్తే రాలనంత జనం అనే నానుడు తరుచూ వింటుంటాము, కానీ ఆదివారం నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ‘ఎన్నికల ప్రచార శంఖారా వం’ కార్యక్రమాన్ని ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు రాకతో అది అక్షరాల నిరూపితమైంది. ప్రతి గ్రామం నుంచి ఓ పది మంది ముఖ్య కార్యకర్తలు సమావేశానికి రావాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి, అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి పిలుపునివ్వగా ప్రతి గ్రామం నుంచి సుమారు 50 మంది కార్యకర్తలు తరలిరావడం జరిగింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిపోయింది. ఫంక్షన్ హాల్ ఆవరణం పూర్తిగా నిండిపోవడంతో కొంత మంది కార్యకర్తలు వెనుతిరిగి వెళ్లి పోవలసి వచ్చింది. సమావేశం పూర్తి అయిన తర్వాత ప్రతి గ్రామంలో ఏ నలుగురు కలిసిన అబ్బబ్బబ్బ….ఏం జనం మాకైతే సందే దొరకలేదు… అని కొందరు, స్థలం లేక తిరిగి రావడం జరిగిందని మరికొంత మంది ముచ్చటించుకున్నారు. మంత్రి హరీశ్ సభకు కేవలం కార్యకర్తలు ఇంత మంది వస్తే రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు జనాలు తరలివస్తే పరిస్థితి ఎంటని మరికొంత మంది గుసగుసలాడుకున్నారు. ఇక ప్రతిపక్షాలు మాత్రం వచ్చిన కార్యకర్తలను చూసి దడుసుకున్నారు. ఏదైనా రాజకీయ పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తే ఖాళీ కుర్చీలు, జనం లేక విలవిల, అట్టర్ ఫ్లాప్ అని ఇతర పార్టీల వాళ్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు. కాని ఆదివారం జరిగిన సభకు ఎలాంటి కామెంట్లు రాకపోగ ప్రతిపక్షలే విస్తూపోయాయి.
ఎమ్మెల్యే మదన్రెడ్డి వర్గం బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి మద్దతు తెలుపుతరా లేదా అనే సందేహానికి ఆదివారం నాటి సభతో చెక్ పడింది. ఎమ్మెల్యే మదన్రెడ్డి వర్గం, సునీతారెడ్డి వర్గం ఇద్దరు కలవడంతో సభలో కోలాహలం నెలకొంది. మంత్రి హరీష్రావు ఎమ్మెల్యే మదన్రెడ్డిని మెదక్ ఎంపీగా చేసే బాధ్యత నాదేనని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఇక మీదట నర్సాపూర్ బీఆర్ఎస్లో వర్గాలు ఉండవని, పాతకొత్త అనే తేడాలు చూపవద్దని అందరిది ఒకటే బీఆర్ఎస్ కుటుంబమని మంత్రి హరీశ్రావు కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలిగించనని ఏ వర్గం లేకుండా అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటానని హామి ఇచ్చారు. సునీతాలక్ష్మారెడ్డిని గెలిపిస్తే రేపు ఎంపీ ఎన్నికల్లో మనకు పూర్తి మద్దతు తెలుపుతారని ఎమ్మెల్యే మదన్రెడ్డి కార్యకర్తలకు సూచించారు.
బీఆర్ఎస్ బలం ఇలా ఉంటే ప్రతిపక్షాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. టికెట్ కేటాయింపుల్లో తమ నాయకుడికి టికెట్ రాలేదని ప్రతి పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. నర్సాపూర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఆవుల రాజిరెడ్డికి, బీజేపీ నుంచి మురళీయాదవ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గాలి అనీల్కుమార్, ఆంజనేయులుగౌడ్, రవీందర్రెడ్డి, బీజేపీ నుంచి గోపి, మల్లేశ్గౌడ్, రఘువీర్రెడ్డి టికెట్ ఆశించిభంగపడ్డారు. కాంగ్రెస్ అసంతృప్తి నేతలు గాందీ భవన్ వద్ద చేసిన రచ్చ అంతాఇంతా కాదు, ఏకంగా ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం పార్టీ అధిష్టానంపై ఎంత గుర్రుగా ఉన్నారో తెలిసిపోతుంది. ఇక బీజేపీలో ప్రెస్మీట్ పెట్టి మరీ అభ్యర్థి అక్రమాలను బహిర్గతం చేశారు. బీఆర్ఎస్ గెలుపు కండ్ల ముందే కనపడుతుందని ఇక ప్రతిపక్షాలకు నూకలు చెల్లినట్లేనని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రతిపక్షాల చూపు బీఆర్ఎస్ వైపు మళ్లుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బీఆర్ఎస్లో భారీ చేరికలు ఉంటాయని ఇప్పటికే చాలా మంది టచ్లోకి వచ్చారని బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించారు.