గజ్వేల్ అర్బన్, జనవరి 30: క్రీడలకు కేరాఫ్ అడ్రస్గా గజ్వేల్ పట్టణం మారిందని, కేసీఆర్ పాలనలో క్రీడాకారులకు తగిన గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ ఖోఖో క్లబ్ ఆధ్వర్యంలో గజ్వేల్ బాలికల ఎడ్యుకేషన్ హబ్లో ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయి సీనియర్ బాలికల ఖోఖో క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ క్రీడాపోటీలను ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ పట్టణంలో రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ ఖోఖో క్రీడాపోటీల్లో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి 17 టీమ్లు పాల్గొన్నాయి. మొదటిస్థానంలో జగదేవ్పూర్ మండలం తీగుల్ జడ్పీహెచ్ పాఠశాల జట్టు నిలువగా, రెండోస్థానంలో సంగారెడ్డి జిల్లా కృష్ణాపూర్ పాఠశాల జట్టు నిలిచింది. క్రీడాపోటీల్లో 150మంది క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాపోటీలకు సహకరించిన మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్కు పీఈటీ ఎలియాస్ రావు ఖోఖో క్లబ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.