చేర్యాల, మార్చి 13: రాష్ట్ర ప్రభుత్వం తపాస్పల్లి, లద్నూరు రిజర్వాయర్లకు వెంటనే గోదావరి జలాలు పంపింగ్ చేసి చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని చెరువులు, కుంటలు నింపి పంటలు కాపాడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. చేర్యాలలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకునే మనస్సు కాంగ్రెస్ సర్కారుకు లేదని, గోదావరి జలాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎందు కు తపాస్పల్లి, లద్నూరు రిజర్వాయర్ నింప డం లేదని ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి మంత్రి కేటీఆర్ జీవో నెం.824 ద్వారా చేర్యాల మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, జనగామ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు నిధులు మంజూరు చేయించానని, ఆ నిధులతో ఓటమి పాలైన నాయకులు ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు తెలిపారు. తాను ఇగోలకు పోదల్చుకోలేదని, తాను తెచ్చిన నిధులతోపాటు అధికార పార్టీ సదరు నేత మరిన్ని నిధులు తీసుకువచ్చి జనగామ, చేర్యాల ప్రాంతాలను అభివృద్ధి చేస్తే బాగుంటుందన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో కొమ్మూరి తన కుమారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి, తాము చెప్పిందే వినాలని, లేని పక్షంలో ఊరుకునేది లేదని బెదిరించారని, నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు.
అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తే జరిగే పరిణామాలకు వారే బాధ్యులు కావాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ జనగామ నియోజకవర్గంలో బలంగా ఉందని, చేర్యాల పీఏసీఎస్ చైర్మన్ వంగా చంద్రారెడ్డి కాంగ్రెస్లో చేరినట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ సర్కారుకు నిరుద్యోగులపై ప్రేమ ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు గ్రామాల్లో, పట్టణాల్లో బీఆర్ఎస్ శ్రేణులతోపాటు ఇతరులను బెదిరిస్తే సహించేది లేదన్నారు.
సమావేశంలో ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వంగా చంద్రారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అనంతుల మల్లేశం, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీశ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అంకుగారి శ్రీధర్రెడ్డి, ముస్త్యాల బాల్నర్సయ్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జింకల పర్వతాలు, గదరాజు చందు, ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర కార్యదర్శ గదరాజు యాదగిరి, శివగారి అంజయ్య, నర్ర ఐలయ్య, బూరగోని తిరుపతిగౌడ్, పచ్చిమడ్ల చిన్న సతీశ్గౌడ్, మాజీ సర్పంచ్ బండకింది కరుణాకర్, ఏర్పుల మహేశ్, ముత్యం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
యువకులు స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు. పట్టణంలోని వీరభద్ర సినిమా టాకీస్ ఏరియాలో యువకులు ఏర్పాటు చేసుకున్న మా మొబైల్ షాపును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి కల్పించే వరకు వేచి ఉండడానికి బదులుగా ఉపాధి మార్గాలు ఎంచుకుని జీవనం సాగిస్తే తల్లిదండ్రులతో పాటు స్నేహితులు సంతోషిస్తారని తెలిపారు. కార్యక్రమంలో షాపు నిర్వాహుకులు జితేంతర్రెడ్డి, బాల్లింగం, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు, తాళ్లపల్లి రాజు తదితరులున్నారు.