చేర్యాల, ఏప్రిల్ 24: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో దేవాలయాలకు మహర్దశ పట్టిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురిలో బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేసిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. గ్రామదేవతల దీవెనలతో సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు.