కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
ముంపు గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం
సిద్దిపేట అర్బన్, జూలై 8: మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో మల్లన్నసాగర్ ముంపు గ్రామాలు ఏటిగడ్డ కిష్టాపూర్, రాంపూర్, ఎర్రవెల్లి, సింగారం, బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, పల్లెపహాడ్, వేములఘాట్ గ్రామాల సర్పంచులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పునరావాసం, నష్టపరిహారం చెల్లిం పు, ఆర్అండ్ఆర్ కాలనీల్లో మౌలిక వసతుల కల్పన తదితర సమస్యలపై చర్చించారు.
నష్టపరిహారం, ప్లాట్ల కేటాయింపు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, కాలనీల్లో గుడి, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, సీసీ రోడ్లు, వైకుంఠధామాల నిర్మాణం ఇతర సమస్యలను పరిష్కరించాలని సర్పంచులు కోరారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదిక పంపామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డి, డీఈవో రవికాంతారా వు, ఆర్డీవోలు విజయేందర్రెడ్డి, అనంతరెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ కాశీనాథ్, జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.