సిద్దిపేట, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లా రైతాంగాన్ని సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సింగూరు ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది.మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టు కింద పంటలు ఎండుతున్నాయి. ఇతర ప్రాజెక్టుల కింద అదే పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరాయి. చివరి ఆయకట్టుకు సాగునీరు అందక పంటలు దెబ్బతింటున్నాయి.
ఇటు సాగునీరు లేక.. అటు కరెంట్ కోతలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. చివరి ఆయకట్టుకు సాగునీరు అందక రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి మాజీ మంత్రి తన్నీ రు హరీశ్రావు స్వయం గా మూడు రోజుల కిందట లేఖ రాశారు. తక్షణమే అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్లు నింపి రైతుల పంటలు కాపాడాలని హరీశ్రావు లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన ప్రధాన రిజర్వాయర్లలో నీటిశాతం రోజు రోజుకూ తగ్గుతున్నది. ప్రస్తుతం అన్నపూర్ణలో 2.72 టీఎంసీలు, రంగనాయకసాగర్లో 0.89 టీఎంసీలు, మల్లన్నసాగర్లో 17.93 టీఎంసీలు, కొండపోచమ్మలో 7.897 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో నీరంతా ఖాళీ కానున్నది. దాదాపు డెడ్ స్టోరేజీకి రిజర్వాయర్లు చేరుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోస్తే చివరి పంటకు నీళ్లు అందుతాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లోని చెరువులను కాళేశ్వరం జలాలతో నింపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భారీ, మధ్యతరహా, చిన్న కాల్వలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ప్రతి చెరువుకు నీళ్లుపోయేలా చేసింది. మండు టెండల్లో సైతం మత్తళ్లు దుంకాయి. సాగునీటి కాల్వల నిర్వాహణను చూసుకోవాల్సిన అధికారులు గాలికి వదిలేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రైతులు సాఫీగా వ్యవసాయం చేసుకున్నారు. నాణ్యమైన కరెంట్ రావడంతో మోటర్లు కాలిపోలేదు. గుంట పొలం ఎండలేదని రైతులు గుర్తుచేస్తున్నారు. 24 గంటల కరెంట్, పుష్కలంగా సాగు నీరు వచ్చింది. ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏరైతును కదిలించినా సంతృప్తిగా లేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వందలాది చెరువులు నింపా రు.
ఎక్కడో పుట్టిన గంగమ్మను 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్లోకి తీసుకువచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేశారు. మండు టెండల్లో చెరువులు మత్తళ్లు దుం కాయి. పలు వాగుల్లో గోదావరి జలాలు జలసవ్వడులు చేశాయి. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ప్రవేశపెట్టి రైతాంగానికి కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాల నుంచి కూలీలు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున పనులు చేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. మరో 15 రోజులైతే యాసంగి పంట చేతికి వచ్చేస్తుంది. యాసంగి పంటకు కాళేశ్వరం జలాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో నీళ్లు ఖాళీ అవుతున్నాయి. ఇంతవరకు చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి. ప్రణాళిక లేకుండా నీటి పారుదలశాఖ అధికారులు ఇష్టారీతిగా సాగునీటిని విడుదల చేయడంతో చాలావరకు నీరంతా వృథాగా పోయిందని రైతులు వాపోతున్నారు.
కాల్వల్లో చెత్తాచెదారం పేరుకు పోయింది. కాల్వల నిర్వహణకు రెండేండ్లుగా ఒక్క రూపాయి ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా పిల్ల కాల్వలు ఎక్కడికక్కడనే అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో పంట పొలాలకు నీరు చేరలేదు. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రైతుల కోసం తన సొంత డబ్బులు ఖర్చుచేసి కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను జేసీబీల సహాయంతో తొలిగించడంతో పాటు నీళ్లు వెళ్లని ప్రాంతాలకు పెద్దమిషన్ పెట్టి నీటి కాల్వలను తవ్వించారు. దుబ్బాక ప్రాంతంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఫలితంగా కొన్ని గ్రామాలకు సాగు నీరు అందించారు.