హుస్నాబాద్, జూలై 3: దశాబ్దాలుగా మెట్ట ప్రాంత ప్రజలు కంటున్న కల ఎట్టకేలకు నెరవేరింది. గోదావరి నీళ్లు వస్తాయి మా నెర్రెలువారిన భూముల గొంతులు తడుపుతాయి అని ఎదురుచూసిన రైతుల నిరీక్షణ ఫలించింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా వరదకాలువ కోసం ఎదురుచూసిన హుస్నాబాద్ మెట్ట ప్రాంత ప్రజల కలలను గౌరవెల్లి రిజర్వాయర్ను నిర్మించి సీఎం కేసీఆర్ నిజం చేసి చూపించారు. దీంతో ఈ ప్రాంత ప్రజల్లో నూతనోత్సాహం వచ్చినట్లయింది. ఒకప్పుడు గుక్కెడు నీటికి అల్లాడిన జనానికి ఒక్కసారిగా గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయి అందులోకి భారీ మోటర్లు నీళ్లు పోస్తుండటంతో ఆనందంతో ఉక్కిబిక్కిరవుతున్నారు. ఇక మన కష్టాలు తీరినట్లేనని, తమకున్న భూమిలో బంగారం పండించ్చొని అంచనాలు వేసుకుంటున్నారు. రిజర్వాయర్లోకి నీళ్లు వస్తున్నాయని తెలుసుకున్న రైతులు, సాధారణ ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి రిజర్వాయర్ను ప్రత్యక్షంగా చూస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది.
2014కు ముందు రిజర్వాయర్ పరిస్థితి
2007 సెప్టెంబర్ 9న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి గౌరవెల్లి రిజర్వాయర్కు శంకుస్థాపన చేశారు. 2009లో రిజర్వాయర్ కట్టపనులతో పాటు కుడికాలువ పనులను కూడా మొదలుపెట్టారు. 1,814 ఎకరాలకు రూ.2.10లక్షల చొప్పున పరిహారం కూడా అందజేశారు. 693ఇండ్లకు పరిహారం అందింది. నిర్వాసిత కుటుంబాలైన 937 కుటుంబాల్లో కొందరికి మాత్రమే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందింది. కేవలం 1.24 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్కు రూపకల్పన చేశారు. కట్ట పనులు సగం వరకు కూడా పూర్తి కాలేదు. 2011నుంచి టన్నెల్తోపాటు కట్ట పనులు కూడా నిలిచిపోయాయి. పరిహారం కోసం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం నిర్వాసితులు పెద్దఎత్తున ఉద్యమాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు.
2014 తర్వాత రిజర్వాయర్ పరిస్థితి
2014లో తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదికి అంటే 2015 ఏప్రిల్ 13న సీఎం కేసీఆర్ స్వయంగా గౌరవెల్లి రిజర్వాయర్ను సందర్శించారు. రిజర్వాయర్ సామర్థ్యం పెంచుకునేందుకు అనుకూలంగా ఉండడంతో 8.23 టీఎంసీలకు పెంచుతూ ప్రకటన చేశారు. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే గౌరవెల్లి రిజర్వాయర్ను కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. వెంటనే పనులు షురువయ్యాయి. అదనంగా 2,030ఎకరాల భూసేకరణ, అదనంగా 185 నిర్వాసిత కుటుంబాలను గుర్తించి.. కేవలం రెండు నుంచి మూడేండ్లలో చెల్లింపులు సైతం చేయించారు. పాత 937 నిర్వాసిత కుటుంబాలతోపాటు 185 నిర్వాసిత కుటుంబాలకు రూ.8 లక్షల చొప్పున ఆర్అండ్ ప్యాకేజీ అందజేశారు. ఇందులో సుమారు 60మంది వరకు ప్యాకేజీ తీసుకోకుండా కోర్టుకు వెళ్లారు. అయినా గడిచిన ఏడాది కాలంగా పనులను ముమ్మరం చేసి మొత్తం మీద రిజర్వాయర్ను పూర్తి చేసి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దీంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో 1.06 లక్షల ఎకరాలకు సాగునీరందనుంది.
వరద కాలువ కాదు.. జీవ కాలువ
ఐదు దశాబ్దాల క్రితం ఎత్తిపోతల పథకం చేపట్టి మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్కు నీళ్లివ్వాలని అప్పటి వామపక్ష పార్టీలు, పలు సంస్థల నాయకులు ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. పలుమార్లు పెద్దఎత్తున ఉద్యమాలు సైతం నిర్వహించారు. చంద్రబాబు హయాంలో వరద కాలువ పేరుతో ఓ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దీనిప్రకారం ఎస్సారెస్పీ పూర్తిగా నిండిన తర్వాత బ్యాక్వాటర్ను కెనాల్ ద్వారా మిడ్మానేరుకు చేర్చి అక్కడి నుంచి తోటపల్లి(ఓగులాపూర్) రిజర్వాయర్లో పోయించి ఆ తర్వాత టన్నెల్ ద్వారా గౌరవెల్లి రిజర్వాయర్లోకి నీరు ఎత్తిపోయాల్సి ఉంటుంది. వరద కాలువ పనులు షురవయినప్పటికీ కొన్ని కారణాల వల్ల మళ్లీ ఆగిపోయాయి. కేవలం వరదలు వచ్చినప్పుడు, ఎస్సారెస్పీ పూర్తిగా నిండినప్పుడు మాత్రమే మిడ్మానేరు, గౌరవెల్లి తదితర ప్రాజెక్టుల్లోకి నీళ్లు వచ్చే విధంగా అప్పుడు రూపకల్పన చేశారు. దీనిపై మెట్ట ప్రాంతంలోని మేధావులు, నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. కాళేశ్వరంతోపాటు ఎల్లంపల్లి రిజర్వాయర్కు మిడ్మానేరును అనుసంధానం చేయడంతో వరద కాలువ జీవకాలువగా మారినట్లయింది. ఓగులాపూర్ వద్ద ఆన్లైన్ రిజర్వాయర్ చేపట్టాలని అప్పటి ప్రభుత్వం 401ఎకరాల భూసేకరణ చేసింది. ఇది అదనపు ఖర్చుగా భావించి తోటపల్లి చెరువును ఆన్లైన్ రిజర్వాయర్గా మార్చివేసి అక్కడి నుంచి గ్రావిటీ, టన్నెల్ ద్వారా నిరంతరం గౌరవెల్లి రిజర్వాయర్లోకి నీళ్లు వచ్చే విధంగా సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు.
చూస్తుంటే సంబురంగుంది..
హుస్నాబాద్ రూరల్: గౌరవెల్లి ప్రాజెక్టులోకి గోదావరి జలాలు రావడం చూస్తూంటే సంబరంగుంది. ఎన్నో ఏండ్లుగా ఈ ప్రాంత రైతుల చిరకాల కలను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. తెలంగాణ రాక ముందు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో పూర్తయింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సతీష్కుమార్కు ఈ ప్రాంత రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఇకపై రైతులు మూడు పంటలు పండించుకోవచ్చు.
– పొన్నబోయిన శ్రీనివాస్, రైతు, మీర్జాపూర్ గౌరవెల్లితో గోస తీరింది..
హుస్నాబాద్ రూరల్: గౌరవెల్లి ప్రాజెక్టుతో రైతుల గోస తీరింది. దశాబ్దాల నాటి కల కూడా నెరవేరింది. గోదావరి జలాలతో హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలంకానుంది. ప్రాజెక్టులో నీళ్లను చూస్తామో లేదో అనే ఓ రందీ కూడా ఉండేది. ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలను ఇక్కడికి తీసుకొచ్చింది. ప్రాజెక్టు, పంప్లు, సొరంగం చూస్తే చాలా సంతోషం అనిపించింది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మించి ఇక్కడి ప్రజల గోస తీర్చిన సీఎం కేసీఆర్కు మా ధన్యవాదాలు.
– వేల్పుల రాజయ్య, రైతు, మీర్జాపూర్
మూడు పంటలు పండిస్తం…
అక్కన్నపేట: సీఎం కేసీఆర్ గోదావరి జలాలను తీసుకొచ్చి హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి జీవం పోశారు. గౌరవెల్లి ప్రాజెక్ట్లోకి నీళ్లను చూస్తేంటే సంబురమవుతుంది. ప్రాజెక్ట్ కిందనే మా భూములు ఇక నుంచి మూడు పంటలు పండుతాయి. పుష్కలంగా కరెంటు, నీళ్లు, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక అన్ని రకాల పంటలూ సాగు చేస్తాం. గత పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపానపోలేదు. ఎనిమిదేండ్లుగా ఈ ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసి గోదావరి జలాలను తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్కు మా రైతుల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుతున్నాం.
– పెండెల బాలకొమురయ్య, రైతు, గోవర్థనగిరి
* బెజ్జంకి మండలం తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్
నుంచి 24కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్,
టన్నెల్ నిర్మాణం జరిగింది.
* ఇందులో 12కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్, 12కిలోమీటర్లు
సొరంగ మార్గం(టన్నెల్) నిర్మాణం జరిగింది.
* పంపుహౌల్లో 32 మెగావాట్ల సామర్థ్యం గల
3 భారీ మోటర్లు బిగింపు
* ప్రత్యేకంగా 132కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం
* 50ఎంవీఏ సామర్థ్యం గల
5 భారీ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు
* కెనాల్, టన్నెల్, పంపుహౌస్ నిర్మాణ వ్యయం
మొత్తం రూ.1,012కోట్లు
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషితోనే రిజర్వాయర్ పూర్తి
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషితోనే గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయింది. నిర్వాసితుల సమస్యలను గానీ, పరిహారం చెల్లింపుల విషయంలో గానీ అడిగిన వెంటనే స్పందించి నిధులు కేటాయించడం, సమస్యలను వెంటనే పరిష్కరించారు. కొంత ఆలస్యమైనప్పటికీ రిజర్వాయర్ వందశాతం పూర్తయింది. గోదావరి నీటిని కూడా రిజర్వాయర్లోకి వస్తున్నాయి. రిజర్వాయర్ పూర్తికావడం హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజల కల నెరవేరినట్లయింది. ఎన్నో ఏండ్లు వేచి చూసిన ప్రజలకు గోదావరి నీళ్లు కనిపించడంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. రాబోయేరోజుల్లో హుస్నాబాద్ ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. కలువలు, డిస్ట్ట్రిబ్యూటరీల పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. ఏదేమైనా రిజర్వాయర్ పూర్తి అయ్యేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్తోపాటు అధికారులకూ ధన్యవాదాలు.
– వొడితెల సతీశ్కుమార్, ఎమ్మెల్యే హుస్నాబాద్
పెరుగుతున్న పర్యాటకులు
గౌరవెల్లి రిజర్వాయర్లోకి నీళ్లు వస్తున్నాయని తెలుసుకున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. నిత్యం పదులసంఖ్యలో కుటుంబాలతోసహా వచ్చి రిజర్వాయర్లోకి నీరు చేరుతున్న దృశ్యాలను చూసి సంబురపడుతున్నారు. ఎస్సారెస్పీ, ఎల్ఎండీ లాంటి డ్యాంలను చూసి మాకెప్పుడు ఇలాంటి డ్యాం వస్తుందని అనుకున్న ఈ ప్రాంత ప్రజల చెంతకే రిజర్వాయర్ రావడంపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. కట్టపైకి వచ్చి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సెల్ఫీలు తీసుకుంటున్నారు.
గౌరవెల్లి రిజర్వాయర్ వివరాలు