గజ్వేల్, జూలై 13: రైతు కుటుంబానికి రైతుబీమా పథకం కొండంత అండగా నిలుస్తున్నది. రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15, 2018లో ఎల్ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకొని ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. గుంట జాగ ఉన్న రైతుకు కూడా ఈ పథకంలో అవకాశం కల్పించడంతో పాటు బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ప్రమాదం, సాధారణ మరణంతో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన సమయంలో బీమాసొమ్ము ఆర్థికంగా ఆదుకుంటున్నది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకంపై ఊరూరా అవగాహన కల్పిస్తున్నది. ఇంటింటికీ తిరిగి రైతుల పేర్లు నమోదు చేసుకుంటున్నారు. రైతు చనిపోయిన వెంటనే రైతుబీమాకు సంబంధించిన అన్ని పత్రాలను వ్యవసాయ శాఖ పరిశీలించి బీమాను నామినీ అకౌంట్లో జమయ్యేలా చూస్తున్నారు.
పథకంలో చేరేందుకు నిబంధనలు…
రైతుబీమా కింద రూ.5 లక్షలు…
తెలంగాణ ప్రభుత్వం 18 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతులకు ఆగస్టు 15, 2018 నుంచి రైతుబీమా కింద రూ.5 లక్షల బీమా లభిస్తుంది. ఏ రైతు మరణించినా రైతులకు రూ. 5లక్షల బీమా కవరేజ్ లభిస్తుంది. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తున్నది. రైతు చనిపోయిన రైతుకుటుంబంలో నామినీకి పదిరోజుల వ్యవధిలోనే రూ.5 లక్షలు పొందుతాడు. రైతుబీమా కార్యక్రమం కింద రైతు మరణం సహజమా లేదా ప్రమాదవశాత్తు సంబంధం లేకుండా రైతుల కుటుంబాలకు బీమా మొత్తం లభిస్తుంది. 2023 జూన్ 18 ముందు మంజూరైన పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వారు అర్హులని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నామినీ నమోదు చేయడం కోసం నామినీ ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ తీసుకురావాలని, రైతుబీమా దరఖాస్తు ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ తీసుకొని వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద సంతకం చేసి ఇవ్వాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం నామినీని మార్పు చేసేందుకు కూడా అవకాశం కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సే ధేయ్యంగా రైతుల అభ్యున్నతి కోసం రైతుబీమా పథకాన్ని ఐదేండ్లుగా రాష్ట్రంలో అమలు చేయడంతో వేలాది మంది రైతు కుటుంబాల్లో వెలుగు నింపుతున్నది. రైతుబీమా పథకంలో పేర్లు నమోదుకాని రైతులతో పాటు కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన రైతుల ప్రయోజనాల కోసం ఆగస్టు 5 వరకు రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆగస్టు 15 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. ఆధార్కార్డులోని వయస్సును ప్రామాణికంగా తీసుకొని బీమాను వర్తింపజేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లోని రైతులు చాలావరకు ఈ పథకం కోసం దరఖాస్తు
చేసుకున్నారు.
అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి
రైతుబీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోని రైతులతోపాటు కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులకు ప్రభుత్వం మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆగస్టు 5వ తేదీలోగా ప్రతిఒక్కరూ సంబంధిత పత్రాలను ఏఈవోలకు అందజేయాలి. చివరివరకు వేచి ఉండకుండా రైతులు తొందరగా ఏఈవోలకు పత్రాలను అందజేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పథకంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన ఈ పథకంతో ఎంతోమంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.
– బాబునాయక్, ఏడీఏ, గజ్వేల్