రామచంద్రాపురం, ఏప్రిల్ 9 : ఇతర రాష్ర్టాల నుంచి నిషేధిత గంజాయిని తీసుకువచ్చి అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎస్వోటీ,ఆర్సీపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆదివారం ఆర్సీపురం పోలీస్స్టేషన్లో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి ప్రాంతానికి చెందిన దీపాకర్ నిషేధిత గంజాయిని ప్యాకెట్లుగా చేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన ప్రీతంరే, బిడ్యుత్రే ఇద్దరు గంజాయిని వాహనాల్లో తరలిస్తుంటారు. మల్కన్గిరి ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి రాజేశ్జైన్ కొల్లూర్లోని ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాల్లో లేబర్గా పనిచేస్తున్నట్లు నటిస్తూ తోటి కూలీలకు గంజాయిని విక్రయిస్తున్నాడు. ప్రీతంరే మల్కన్గిరిలో ఉంటూ గంజాయి సాగు చేసే వారి వద్ద నుంచి గంజాయిని తీసుకొని దీపాకర్తో కలిసి వివిధ ప్రాంతాలకు సఫ్లై చేస్తుంటాడు. బిడ్యుత్రే వీరిద్దరితో కలిసి గంజాయిని వివిధ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తుంటాడు. రాజేశ్జైన్ కూలీపని చేస్తున్నట్టు నటిస్త్తూ దీపాకర్, ప్రీతంరే, బిడ్యుత్రేలు తీసుకువచ్చే నిషేధిత గంజాయిని స్థానికంగా ఉండే వారికి రహస్యంగా అమ్ముతుంటాడు.
ఈ నెల7న 120 కేజీల గంజాయిని 60 ప్యాకెట్లలో రెండేసి కిలోల చొప్పున ప్యాక్ చేసి రెండు కార్లలో దీపాకర్, బిడ్యుత్రే తీసుకొని హైదరాబాద్కు వస్తుండగా వారికి ముందు ప్రీతంరే పల్సర్ బైక్పైన ఎస్కార్ట్గా వస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్వోటీ, ఆర్సీపురం పోలీసులు 8న కొల్లూర్లో మాటువేసి ఉన్నారు. కొల్లూర్లో రాజేశ్జైన్ నివసిస్తున్న లేబర్ ఇండ్ల వద్దకు దీపాకర్, ప్రీతంరే, బిడ్యుత్రే వచ్చి గంజాయిని అందజేస్తుంటే ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ శివకుమార్ల ఆధ్వర్యంలో పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి నుంచి 120 కేజీల గంజాయి, రెండు కార్లు, ఒక బైక్, 4సెల్ఫోన్లు మొత్తం రూ. 50,90,000 విలువ చేసే వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు దీపాకర్ పోలీసుల కండ్లు కప్పి తప్పించుకున్నాడు. మిగిలిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు గంజాయిని కేజీ రూ.4 వేలు చొప్పున అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ రూ.30 వేలకు కేజీ చొప్పున విక్రయిస్తున్నారని డీసీపీ తెలిపారు.
గంజాయి, మాదకద్రవ్యాలు అమ్మితే సమాచారం ఇవ్వాలి
నిషేధిత గంజాయి, మాదకద్రవ్యాలను ఎవరైనా అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ శిల్పవల్లి తెలిపారు. నిషేధిత గంజాయి, మాదకద్రవ్యాలు రహస్యంగా క్రయవిక్రయాలు చేస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రజలు సహకరించాలని సూచించారు. వీటివల్ల యువత చెడిపోతుందని, మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. నిషేధిత మాదకద్రవ్యాలతో కలిగే అనార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవేర్నెస్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీసీ నర్సింహరావు, ఎస్సైలు శశికాంత్రెడ్డి, వెంకట్, ఎస్వోటీ పోలీసు సిబ్బంది ఉన్నారు.