సిద్దిపేట అర్బన్, జూన్ 25: ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్గౌడ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు అవుతున్నారని.. కానీ అంబేద్కర్ చెప్పిన సూచనలు కొంత మాత్రమే పాటిస్తున్నారన్నారు. దళిత జర్నలిస్టులు సమాజాన్ని చైతన్యవంతం చేసి ఐక్యత తీసుకురావాలన్నారు. సమాజం కోసం పనిచేసేవాళ్లను ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేవన్నారు. కల్యాణలక్ష్మి పథకం దళితులను ఉద్దేశించే సీఎం కేసీఆర్ ప్రారంభించారన్నారు.
దళితబంధు పథకం ఒక విప్లవాత్మకమన్నారు. హైదరాబాద్ నడి ఒడ్డున 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే నేడు దేశం గర్వపడుతున్నదన్నారు. ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఇటీవల వెలువడ్డ నీట్ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ గురుకుల కళాశాల విద్యార్థులే అద్భుతమైన ర్యాం కులు సాధించారన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా భారతదేశంలో రూ.20 లక్షలు ఇస్తు న్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నేడు ప్రభుత్వ గురుకుల పాఠశాలలు తయారు చేశామన్నారు. తెలంగాణలో ప్రతి లక్ష జనాభాకు 22 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఆడపిల్లలు చదువుకోవాలంటే అనేక ఇబ్బందులు ఉండేవని.. నేడు మహిళా ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. దళితబంధు పథకంలో ఈ దఫా దళిత జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తామన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా.. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం గొప్ప విషయమన్నారు. చిన్న రాష్ర్టాల ఏర్పాటుపై అంబేద్కర్ రాజ్యాంగంలో రాయడం వల్లనే నేడు తెలంగాణ ఏర్పడిందన్నారు.
దళిత జాతి అభ్యున్నతి కోసం దళిత జర్నలిస్టులు పని చేయాలని మంత్రి హరీశ్రావు సూచించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. దళిత జర్నలిస్టులు వృత్తిపరంగా, నైపుణ్యం సాధించాలన్నారు. ఈ సందర్భంగా బుద్ధవనం ప్రత్యేక అధికారి, ఐడీజేఎన్ అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, అణిచివేతను మీడియా ద్వారా దళితజర్నలిస్టులు అందరికీ తెలియజేయాలన్నారు. సమన్వయంతో ముందుకు వెళ్తూ నూతన శక్తి సామర్థ్యాలు అందించాలన్నారు. దళిత జర్నలిస్టులు ఒక కమిట్మెంట్తో పని చేయాలన్నారు. అనంతరం ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ తెలంగాణ చాప్టర్ కన్వీనర్గా జనార్దన్, కో కన్వీనర్గా రాజలింగాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐడీజేఎన్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.