ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్, సంస్కృత పరీక్షలు నిర్వహించారు. మెదక్ జిల్లాలో 31 పరీక్ష కేంద్రాల్లో 7,427 మంది విద్యార్థులకు 6,899 మంది హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడా డిబార్, మాల్ప్రాక్టీస్ నమోదు కాలే దు. మెదక్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, గీత జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజర్షిషా తనిఖీ చేశారు. సంగారెడ్డి జిల్లా 19,605 మంది విద్యార్థులకు 18,819 మంది పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 52 పరీక్షా కేందాలను ఏర్పాటు చేయగా, ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచోసుకోలేదు.
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 15: ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లాలో తొలిరోజు 31 పరీక్షా కేంద్రాల్లో ఫస్టియర్ పరీక్షకు 7,427 మంది విద్యార్థులకు, 6,899 మంది హాజరయ్యారు. మొత్తంగా 93 శాతం హాజరు నమోదు అయినట్లు ఇంటర్మీడియెట్ జిల్లా నోడల్ అధికారి సత్యనారాయణ తెలిపారు. జనరల్ విభాగంలో 6,942 మంది విద్యార్థులకు 6,447 మంది హాజరయ్యారు. ఒకేషన్లో విభాగంలో 485 మందికి 452 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు గంట ముందునుంచే అనుమతించామని, జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు జరిగాయి.
మెదక్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, గీత జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. ఇన్విజిలేటర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ప్రశ్నాపత్రాల ఓపెనింగ్ ఫుటేజీని పరిశీలించారు. కలెక్టర్వెంట జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 15: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షలో భాగంగా జరిగిన తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్, సంస్కృత పరీక్షలకు 95.99 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 19,605 మంది విద్యార్థులకు, 18,819 మంది పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 52 పరీక్షా కేందాలను ఏర్పాటు చేయగా, ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు చోటు లేకుండా పూర్తి బందోబస్తు చేపట్టారు. సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించాలని సీఎస్, డీవోలకు సూచించారు. డీఈసీ మెంబర్లు 4 పరీక్షా కేంద్రాలు, ఫ్లయింగ్ స్కాడ్లు 9 కేంద్రాలు, సిట్టింగ్ స్కాడ్స్ 4 కేంద్రాలు, డీఐఈవో 2 కేంద్రాలను సందర్శించారు. కలెక్టర్వెంట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆర్ గోవింద్రాం ఉన్నారు.