జహీరాబాద్, అక్టోబర్ 3: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో ఏర్పాటు చేస్తున్న జాతీయ ఉత్పాదక మండలి (నిమ్జ్)లో పరిశ్రమల ఏర్పాటుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. నిమ్జ్లో పరిశ్రమల ఏర్పాటుకు పలు సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాయి. 11,635 ఎకరాల్లో నిమ్జ్ను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ ఆర్థిక కారిడార్ను విస్తరిస్తున్నారు. నిమ్జ్ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. పారిశ్రామిక రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 65వ జాతీయ రహదారి నుంచి నిమ్జ్ ప్రాజెక్టు వరకు ప్రత్యేక రోడ్డు నిర్మిస్తున్నది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు కృషితో జహీరాబాద్ ఇండస్ట్రియల్ హబ్గా ఎదుగుతున్నది.
జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి చౌరస్తా నుంచి నిమ్జ్కు 100 మీటర్లు వెడల్పుతో ఆరులేన్ల రోడ్డు నిర్మిస్తున్నారు. 9.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ రోడ్డు నిర్మించేందుకు జహీరాబాద్, ఝరాసంగం మండలంలోని హుగ్గెల్లి, రంజోల్, కృష్ణాపూర్, మాచునూర్, బర్దీపూర్ గ్రామాల్లోంచి 65 ఎకరాల భూమిని సేకరించారు. 229 మంది రైతుల భూమి రోడ్డు నిర్మాణంలో తీసుకున్నారు. 60 ఎకరాల భూమికి రైతులకు ప్రభు త్వం రూ.7.5 కోట్లు నష్ట్టపరిహారం చెల్లించింది. 5 ఎకరాల భూమికి సంబంధించి రైతులు కోర్టులో కేసులు వేయడంతో పెడింగ్లో ఉంది. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని 5 ఎకరాల భూ సమస్యను పరిష్కరించారు. నిమ్జ్ ప్రాజెక్టులో భూసేకరణకు ఇద్దరు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లను నియమించారు.
వంద మీటర్లుతో ఆరులేన్లు రోడ్డు
65వ జాతీయ రహదారి హుగ్గెల్లి చౌరస్తా నుంచి ఝరాసంగం మండలంలోని ఎల్గొయి, బర్ధిపూర్ గ్రామ శివారులో నిర్మిస్తున్న నిమ్జ్కు ప్రత్యేక రహదారి సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. 65వ జాతీయ రహదారి నుంచి నేరుగా బర్ధిపూర్ శివారులోని నిమ్జ్ ప్రాంతానికి చేరుకునేందుకు వంద మీటర్లతో రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ రోడ్డుకు నారింజ వాగు, కృష్ణాపూర్, రంజోల్, బర్ధిపూర్ శివారులో బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. దీంతో పాటు మాచునూర్ శివారులో ఝరాసంగం-జహీరాబాద్ రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిమ్జ్లో ఉత్పత్తి చేసే పరికరాను భారీ వాహనాల్లో ఆయా రాష్ట్రాలకు తరలించేందుకు 65వ జాతీయ రహదారికి లీక్ రోడ్డు నిర్మిస్తున్నారు.
12,635 ఎకరాల్లో నిమ్జ్ నిర్మాణం
ఝరాసంగం- న్యాల్కల్ మండలంలోని 17 గ్రామాల్లో నిమ్జ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 12,635 ఎకరాల భూమిని సేకరించింది. ఝరాసంగం మండలంలోని బర్ధిపూర్లో 319.05 ఎకరాలు, ఎల్గొయిలో 1838.32, చిలేపల్లి 585.04, న్యాల్కల్ మండలం రూక్మాపూర్లో 313.10, ముంగి 445.22, గణేశ్పూర్ 597.39, హుసెల్లి 731.29, గుంజెట్టి 291.33, హద్నూర్ 577.29, న్యామతాబాద్ 1221.10, మామిడ్గి 1487.00, కల్బేమాల్ 415.16, బసంత్పూర్ 248.11, మెంటల్కుంట 658.27, గంగ్వార్ 38.17, రేజింతల్ 1734.34, మాల్కాన్పహాడ్ 216.05 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. నిమ్జ్ కోసం 7045 మంది రైతుల నుంచి ప్రభుత్వం భూములు సేకరిస్తున్నది. ఎకరానికి రూ.15 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లిస్తున్నది.
నిమ్జ్ ప్రత్యేకతలు
నిమ్జ్లో 3 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి ఆవకాశాలు లభిస్తాయి. నిమ్జ్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతోపాటు పలు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. ప్రపంచంలో గుర్తింపు పొందిన భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు ముందుకు వస్తున్నారు. ట్రైటాన్కు 150 ఎకరాలు కేటాయించారు. రూ.2100 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేస్తారు. 25 వేల మందికి ఉద్యోగాలు లభించే ఆవకాశం ఉంది. లైట్ ఆటో పెట్టుబడికి 100 ఎకరాలు కేటాయించారు. రూ.1500 కోట్లు పెట్టుబడి. జర్మనీకి చెందిన ఆటోమోటీవ్ వాహన విడిభాగాలు, ముడి పదార్థాల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పంద చేసుకున్నారు. 9 వేల మందికి ప్రత్యక్షంగా, 18 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించే ఆవకాశం ఉంది.
వెమ్ టెక్నాలజీస్తో 2 వేల ఉద్యోగాలు, 4 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. రూ.1000 కోట్లు పెట్టుబడి. పరిశ్రమ ఏర్పాటుకు 511 ఎకరాలు. ఈ పరిశ్రమల్లో ఆధునాతన రక్షణ, ఏరోస్పేస్ పరికరాలు, రక్షణ ఏరోనాటిక్స్ అంతరిక్ష రంగాల్లో ఉపయోగించే వాటిని ఉత్పత్తి చేస్తారు. ఏరో స్ట్రక్చర్స్, ఏరో ఇంజిన్స్ రాడర్, సిస్టమ్స్, హెలీకాప్టర్లు, విమానాలకు సంబంధించిన పరికరాలు ఉత్పత్తి చేస్తారు.
ఆరు లేన్ల రోడ్డు నిర్మాణం
65వ జాతీయ రహదారి నుంచి ఝరాసంగం మండలంలోని నిమ్జ్ ప్రాంతం వరకు 9.5 కిలోమీటర్లు ఆరు లేన్ల రోడ్డును నిర్మిస్తున్నాం. దీంతోపాటు బ్రిడ్జి, కాల్వర్టులు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. రూ.100 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టాం. డిసెంబర్ వరకు పనులు పూర్తి చేస్తాం. రోడ్డు పనులు నాణ్యతగా చేసేందుకు రోజూ పర్యవేక్షిస్తున్నాం. – జనకీరాంరెడ్డి, ఏఈఈ నిమ్జ్ రోడ్డు
జహీరాబాద్కు దేశంలోనే గుర్తిపు వచ్చింది
నిమ్జ్ ప్రాజెక్టుతో జహీరాబాద్కు దేశంలోనే గుర్తింపు రావచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నది. న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడంతో అక్కడ యువతకు ఉపాధి లభించే ఆవకాశాలు వచ్చాయి. స్థానికంగా ఉద్యోగాలు లభించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు.
– మాల్కాపూరం శివకుమార్, ఉమ్మడి మెదక్ డీసీఎంఎస్ చైర్మన్
పారిశ్రామికంగా జహీరాబాద్ అభివృద్ధి
జహీరాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధి కల్పించి ఆర్థిక రంగంలో అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. తెలంగాణ అభివృద్ధికి నిమ్జ్ ప్రాజెక్టు ఒక నిదర్శనం.
– దేవీప్రసాద్రావు, నియోజకవర్గ సమన్వయకర్త