మెదక్ మున్సిపాలిటీ, మార్చి 9 : ఈనెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల మేరకు పరీక్షలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈనెల 15 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 13,616 మంది విద్యార్థులు హాజరవుతుండగా,ప్రథమ సంవత్సరం 6,999 మంది, ద్వితీయ సంవత్సరం 6,617 మంది పరీక్షలు రాయనున్నారన్నారు. ఇందుకోసం మొత్తం 31 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 31 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 31 మంది శాఖాధికారులతో పాటు ఒక ఫ్ల్లయింగ్ స్కాడ్, 4 సిట్టింగ్ స్కాడ్స్, 5 కస్టోడియన్ టీమ్లను నిమించామన్నారు. 14 పాయింట్లలో ప్రశ్నా పత్రాల స్టోరేజీ చేస్తున్నట్లు వివరించారు.
ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 10,700 మంది హాజరవయనున్నారని, ఇందుకోసం జిల్లాలో 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల స్టోరేజీకి 16 పాయింట్లు గుర్తించామన్నారు. సీసీ కెమెరా నిఘాలో నిర్వహించే ఈ పరీక్షలకు 3 ఫ్లయింగ్, 17 సిట్టింగ్, 19 కస్టోడియన్ బృందాలను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రశ్నాపత్రాల స్టోరేజీ, తరలింపు, పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు సకాలంలో సెంటర్లకు చేరుకునేలా బస్సులు నడపాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు సంబంధింత శాఖల అధికారులను ఆదేశించారు.
పరీక్షల సమయంలో విద్యుత్ సమస్యలు కలుగకుండా చూడాలని విద్యుత్ అధికారులను కలెక్టర్ సూచించారు. పోస్టల్ శాఖ జవాబు పత్రాలను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీటితో పాటు టాయిలెట్ సౌకర్యాలు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించారు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకురావొద్దన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ, జిల్లా విద్యాధికారి రాధాకిషన్, జిల్లా పరీక్షల అధికారి రామేశ్వర్రావు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ట్రాన్స్కో అధికారి శ్రీకాంత్, డీటీవో శ్రీనివాస్గౌడ్లతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.