గజ్వేల్, అక్టోబర్ 6: గత ప్రభుత్వాల హయాంలో కూరగాయల వ్యాపారులు ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా రోడ్లపైనే రోజూ కూరగాయల విక్రయాలు చేపట్టారు. వర్షాకాలం వచ్చిందంటే వ్యాపారుల తిప్పలు అన్నీఇన్నీ కావు. 2014లో గజ్వేల్ నుంచి కేసీఆర్ గెలుపొందిన తర్వాత వ్యాపారుల బాధలు తెసుకొని సమీకృత మోడల్ మార్కెట్ను నిర్మించాలనే ఆలోచనతో పట్టణ నడిబొడ్డు వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టడంతో వ్యాపారలు బాధలు తొలిగిపోయాయి.
సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులతో వ్యాపారులు ఫిదా అయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక హంగులతో సమీకృత మార్కెట్ వినియోగంలోకి వచ్చింది. గజ్వేల్ పట్టణంలోని సమీకృత కూరగాయల(వెజ్ నాన్వెన్) మార్కెట్ను సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.22.85కోట్లతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించగా 2019లో వినియోగంలోకి తీసుకొచ్చారు. ఇందులో కూరగాయలు, పూలు, పండ్లు, మాంసం, చేపలు, సూపర్ మార్కెట్ల కోసం విడివిడిగా స్టాల్స్ ఏర్పాటు చేశారు.
ఇందులో మొత్తం 246 స్టాల్స్ ఏర్పాటు చేయగా అందులో 52 స్టాళ్లు మాంసం, చేపల విక్రయానికి, 111 స్టాళ్లు కూరగాయలు, 83 స్టాళ్లు పూలు, పండ్ల విక్రయానికి కేటాయించారు. ఇందులో మహిళలే ఎక్కువగా తమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. రోజుకు 10క్వింటాళ్ల కూరగాయలు, 3క్వింటాళ్ల పూలు, 2 క్వింటాళ్ల పండ్లు అమ్ముడవుతున్నాయి. రోజూ సగటున రూ.12లక్షల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ సమీకృత మార్కెట్ నిర్వహణ బాగుండడంతో గత కొద్ది రోజుల క్రితం ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు లభించింది. ఈ మార్కెట్ పైన క్లాక్ టవర్ నిర్మాణం ఎంతో అద్భుతంగా ముస్తాబు చేశారు.
గజ్వేల్కు కేసీఆర్ రాకముందు కూరగాయలు అమ్ముకోవాలంటే రోడ్లపైనే వ్యాపా రం కొనసాగించాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. వర్షాకాలంలో వాన కొడుతున్నా గొడుగుపట్టుకొని కూరగాయలు విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. తమ బాధలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ సమీకృత మోడల్ మార్కెట్ ఒకే చోట నిర్మించడంతో అన్ని విధాలుగా బాగుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికే వచ్చి కూరగాయలు కొనుకునే విధంగా మార్కెట్ కట్టించడంతో రోడ్లపైన అమ్ముకునే బాధలు పోయాయి. ఇంతమంచి మార్కెట్ కట్టించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– రామచంద్రం, కూరగాయల వ్యాపారి
గజ్వేల్లో రైతు బజారు కట్టించాలని ఎన్నోసార్లు అధికారులకు అర్జీలు పెట్టాం. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ రూ స్పందించలేదు. కేసీఆర్ గజ్వేల్కు రాకతోనే మా బాధ లు పోయాయి. కొద్ది రోజుల్లోనే గజ్వేల్ నడిబోడ్డున సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టడంతో ఇప్పుడు ఎలాంటి బాధలు లేవు. ఒక దగ్గరనే కూరగాయలు, పూలు, పండ్లు, మాంసం, చేపలు, కిరాణా సరుకులు దొరుకుతున్నాయి. ఇక్కడి మార్కెట్ను చూసేందుకు అధికారులు, ఇతర రాష్ర్టాల నుంచి ప్రజాప్రతినిధులు వస్తున్నారు.
– కొలిచెలిమే స్వామి, కూరగాయల వ్యాపారి