సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 1: విద్యార్థిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బావి పౌరులైన విద్యార్థులను బావి శాస్త్రజ్ఞులుగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రదర్శనలు ఎంతో దోహదం చేస్తాయి. ఒక్కో విద్యార్థికి ఒక్కో విషయంలో ఎనలేని పట్టు ఉంటుంది. ఆ పరిజ్ఞానాన్ని ప్రదర్శించే వేదికనే ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నిర్వహించిన పోటీల్లో 2021-22 విద్యా సంవత్సరంలో 82 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో ఈ ప్రదర్శనలు ఉంటాయి. ఈ ప్రదర్శనలతో పాటు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్ (జేఎన్ఎన్ఎస్ఎమ్ఈఈ)ను కూడా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రధానాంశం ‘టెక్నాలజీ అండ్ టాయ్స్’ అని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ఉప అంశాలు…
ప్రధాన అంశంలో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పురోగతి, పర్యావరణ అనుకూల పదార్థం, ఆరోగ్యం- పరిశుభ్రత, రవాణా – ఆవిష్కరణ, పర్యావరణ ఆందోళనలు, ప్రస్తుత ఆవిష్కరణలో చారిత్రక అభివృద్ధి, మాకోసం గణితం అనే ఉప అంశాలు ఉన్నాయి.
విద్యార్థులు పాటించాల్సిన నియమాలు…
ఉప అంశాల్లో ఏదో ఒక అంశాన్ని ఎంచుకొని ప్రాథమికోన్నత స్థాయి (6 నుంచి 8 వరకు తరగతి), ఉన్నత స్థాయి (9వ తరగతి నుంచి 12వ తరగతి) విద్యార్థులచే ప్రత్యక్షంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు, టీటీసీ, బీఎడ్ చేస్తున్న విద్యార్థులు టీచర్స్ లర్నింగ్ మెటీరియల్ను ప్రదర్శించవచ్చు. జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థుల ద్వారా ఎగ్జిబిట్లను జిల్లా స్థాయి ఎగ్జిబిషన్లో ప్రదర్శించాలి. అదేవిధంగా జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ 2021-22 ఎగ్జిబిషన్, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్(జేఎన్ఎన్ఎస్ఎమ్ఈఈ) రెండింటినీ ఒకే వేదికగా నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకున్నది.
విజయవంతం చేయాలి
జిల్లాలో నిర్వహించనున్న జిల్లాస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ 2021-22 ఎగ్జిబిషన్, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్(జేఎన్ఎన్ఎస్ఎమ్ఈఈ) ప్రదర్శనలను విజయవంతం చేయాలి. ఎంఈవోలు, హెచ్ఎంలు, గైడ్ టీచర్ల సహాయంతో ఎగ్జిబిషన్ విజయవంతం చేసేందుకు కృషిచేయాలి. ఈ పోటీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ, కేజీబీవీ, రెసిడెన్షియల్, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాల్గొని జయప్రదం చేసేందుకు తమవంతు కృషిచేయాలి.
– నాంపల్లి రాజేశ్, సంగారెడ్డి డీఈవో