పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా విద్యార్థులకు సూచించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం ఆయన పర్యటించి కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధవహించాలని, వారి సామర్థ్యాలను తెలుసుకుని ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది సహకారంతో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
– వెల్దుర్తి, మార్చి 18
వెల్దుర్తి, మార్చి 18: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి, జిల్లాను అగ్రస్థానంలో నిలుపాలని విద్యార్థులకు మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం వెల్దుర్తిలోని కస్తూర్భా పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో చర్చించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారి సామర్థ్యం తెలుసుకోవాలన్నారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారిపై శ్రద్ధ వహించి ముందుకు వెళ్లేలా ప్రోత్సహించాలన్నారు. పరీక్షలు రానున్నాయని, విద్యార్థులను పూర్తిస్థాయిలో పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. టీవీలు, సెల్ఫోన్లకు దూరంగా ఉంచడంతో పాటు శుభకార్యాలు, దూర ప్రయాణాలకు తీసుకెళ్లరాదన్నారు.
పాఠశాలలో తాగునీటి ప్లాంట్ చెడిపోయిందని, వేడి నీరు లేదని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మరమ్మతులు చేయిస్తామన్నారు. తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని జిల్లా మంత్రి ఆదేశాల మేరకు ముఖాముఖి నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం డీఈవో, జిల్లా స్థాయి, నోడల్, మండల అధికారులు పాఠశాలల్లో జరిగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమవేశాల్లో పాల్గొని పరీక్షలు, ఉత్తమ ఫలితాలపై చర్చిస్తారన్నారు. కలెక్టర్ వెంట డీఈవో రాధాకిషన్, ఎంఈవో యాదగిరి, ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, సర్పంచ్ భాగ్యమ్మ ఆంజనేయులు, ఎస్వో ఫాతిమా, ఎంపీవో విఘ్నేశ్వర్ ఉన్నారు.
వందశాతం ఉత్తీర్ణత: డీఈవో రాధాకిషన్
పది ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యమని డీఈవో రాధాకిషన్ అన్నారు. డీఈవో మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల సమయం దగ్గర పడిందని, చదువుపై దృష్టి సారించేలా తల్లిదండ్రులు, టీచర్లు శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థుల భవిషత్తుకు పది తొలిమెట్టని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఉంటారన్నారు. సమావేశంలో ఎంఈవో యాదగిరి, హెచ్ఎం సాంబయ్య, ఎస్ఎంసీ చైర్మన్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.