పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దళారులబారిన పడి పత్తి రైతులు మోసపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తున్నారు. గత సంవత్సరం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు ప్రైవేట్గా విక్రయించారు. ఈ ఏడాది ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.7,020 మద్దతు ధర నిర్ణయించగా సీసీఐ కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతేడాది మొత్తం గజ్వేల్ మార్కెట్ యార్డు, జిన్నింగ్ మిల్లులో కలిసి లక్షా 50 వేల క్వింటాళ్లకు పైగా పత్తి విక్రయాలు జరిగాయి. ఈ సంవత్సరం గజ్వేల్, ములుగు డివిజన్లలో మొత్తం 50,028 ఎకరాల్లో పత్తి సాగు కాగా 3,50,196 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
గజ్వేల్అర్బన్, డిసెంబర్ 15: పత్తి కొనుగోళ్లలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ దూసుకుపోతున్నది. గతేడాది కంటే ఈసారి రెట్టింపు పత్తి విక్రయాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం మార్కెట్లో పత్తికి మంచి ధర వచ్చింది. కానీ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్గా విక్రయించారు. ఈ ఏడాది ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.7020మద్దతు ధర ప్రకటించగా సీసీఐ కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతేడాది అక్టోబర్ 24 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా క్వింటాల్ పత్తికి రూ.7వేల నుంచి అత్యధికంగా రూ.8300ల వరకు ధర పలికింది. గతేడాది డిసెంబర్ 14 నాటికి 38 వేల క్వింటాళ్లకు పైగా పత్తి విక్రయాలు జరుగగా మొత్తం గజ్వేల్ మార్కెట్ యార్డు, జిన్నింగ్ మిల్లులో కలిసి లక్షా50వేల క్వింటాళ్లకు పైగా పత్తి విక్రయాలు జరిగాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా మద్దతు ధర రూ.7020 ఉండగా, తేమ శాతాన్ని బట్టి సీసీఐ, జిన్నింగ్ మిల్లులు, ట్రేడర్స్ రైతులకు డబ్బులు చెల్లిస్తున్నాయి. ఇప్పటివరకు మార్కెట్యార్డులో ట్రేడర్స్ సీసీఐ కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు 8109 మంది రైతుల నుంచి 66వేల క్వింటాళ్లకు పైగా పత్తి కొనుగోలు చేశాయి.
గజ్వేల్, ములుగు వ్యవసాయ డివిజన్న్లలో మొత్తం 50,028 ఎకరాల్లో పత్తిసాగైనట్లు ఏడీఏలు బాబునాయక్, అనిల్ తెలిపారు. గజ్వేల్ డివిజన్లోని గజ్వేల్ మండలంలో 14459 ఎకరాలు, కొండపాకలో 6206, రాయపోల్లో 5811ఎకరాల్లో పత్తి సాగు కాగా మొత్తం 26,476ఎకరాల్లో పత్తి సాగైంది. ములుగు డివిజన్లోని జగదేవ్పూర్ మండలంలో 15818.23, మర్కూక్లో 3880, ములుగులో 1151.31, వర్గల్లో 2671.35 ఎకరాల్లో పత్తిసాగు కాగా ములుగు డివిజన్లో మొత్తం 23522.09 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. గజ్వేల్, ములుగు డివిజన్లలో కలిసి మొత్తం 50,028ఎకరాల్లో పత్తి సాగు కాగా 3,50,196క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
గతేడాది గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో జరిగిన విక్రయాల కంటే రెట్టింపుగా ఈ ఏడాది పత్తి విక్రయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గజ్వేల్ ప్రాంతంలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వల్ల విక్రయాలు పెరిగినట్లు భావిస్తున్నాం. ఇప్పటి వరకు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల నుంచి 467 క్వింటాళ్ల పత్తిని ట్రేడర్లు కొనుగోలు చేయగా, జిన్నింగ్ మిల్లులు 34,180 క్వింటాళ్ల పత్తిని, సీసీఐ 31,496 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశాయి. గతేడాది ఈ సమయానికి వచ్చిన పత్తి కంటే ఈ సంవత్సరం రెట్టింపుగా పత్తి మార్కెట్లో కొనుగోలుకు రావడం ఎంతో సంతృప్తినిస్తుంది. గతేడాది గజ్వేల్ మార్కెట్లో లక్షా50వేల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరుగగా, మా అంచనాల ప్రకారం ఈ ఏడాది గజ్వేల్ మార్కెట్లో 2,50,000 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. రైతులకు, సీసీఐ కొనుగోలు కేంద్రాల నిర్వహణకు, అధికారులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. దీనివల్ల రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఈసారి రైతులకు డబ్బుల చెల్లింపుల్లో ఎలాంటి మోసాలు జరుగకుండా బ్యాంకు ఖాతాకు, ఫోన్ నంబరుకు ఆధార్ను అనుసంధానం చేసింది. ఈ విషయాన్ని రైతులకు మా సిబ్బంది ముందే వివరించడంతో ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదు. వీలైనంత త్వరగా రైతులకు డబ్బులు చెల్లింపులు జరుగుతున్నాయి.