మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకంతో దవాఖానల్లో డెలివరీలు పెరుగగా, వీటి సంఖ్యను మరింత పెంచేందుకు ‘టీమ్ బేస్డ్ ఇన్సెంటీవ్’ పేరుతో వైద్యారోగ్యశాఖకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రతీ డెలివరీకి డాక్టర్ స్థాయి నుంచి ఆయా వరకు కలిపి రూ.3000 నజరానా అందజేయనున్నది. ఈ క్రమంలో సిజేరియన్లతో వచ్చే సమస్యలు, సాధారణ డెలివరీల వల్లే కలిగే ప్రయోజనాలు, బిడ్డకు ముర్రుపాలు పట్టే ఆవశ్యకతను వైద్య సిబ్బంది గర్భిణులకు వివరిస్తున్నారు. ప్రైవేటుకు వెళ్లి వేలు ఖర్చు చేసుకోకుండా, కార్పొరేట్కు దీటుగా సర్కారు దవాఖానల్లో అందుతున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూలై వరకు సంగారెడ్డి జిల్లాలో 6383, మెదక్ జిల్లా కేంద్రంలో 1063 నార్మల్ డెలివరీలు జరిగాయి. తల్లీబిడ్డల సంక్షేమమే ధ్యేయంగా తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంతో భవిష్యత్తులో సాధారణ ప్రసవాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
సంగారెడ్డి/మెదక్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానల్లో క్రమంగా సహజ ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. అత్యవసరమైతే తప్ప వైద్యులు గర్భిణులకు ఆపరేషన్లు(సీ సెక్షన్) చేయడంలేదు. సాధారణ ప్రసవాలతో చేకూరే ప్రయోజనాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రతి సమావేశంలో ప్రత్యేకంగా వివరిస్తున్నారు. వైద్యులతో నిర్వహించే సమీక్షా సమావేశాల్లోనూ నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని సూచిస్తున్నారు. దీంతో సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కాలంలో గర్భిణులకు ఆపరేషన్లు తగ్గి నార్మల్ డెలివరీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. కాగా ఇటీవల సీఎం కేసీఆర్ నార్మల్ డెలివరీలను మరింత పెంచేందుకు వైద్యులకు ప్రోత్సాహాకాలు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సాధారణ ప్రసవాలను మరింత పెంచేందుకు ‘టీం బెస్ట్ ఇన్సెంటీవ్’ పేరుతో వైద్య సిబ్బందికి రూ.3వేల ప్రోత్సాహకం అందజేయాలని నిర్ణయించింది. ప్రతి నార్మల్ డెలివరీకి ప్రభుత్వ పీహెచ్సీ, జనరల్ దవాఖానల్లో పనిచేసే వైద్య సిబ్బందికి రూ.3వేల నజరానా అందజేయనున్నారు. పీహెచ్సీ, ఏరియా దవాఖాన, జిల్లా కేంద్ర దవాఖానల్లో నార్మల్ డెలివరీ చేసిన పక్షంలో డాక్టర్కు రూ. వెయ్యి, స్టాఫ్నర్సు, ఏఎన్ఎంలకు రూ. వెయ్యి, ఆయా, పారిశుధ్య కార్మికులకు రూ.500, సబ్సెంటర్ ఏఎన్ఎంకు రూ.250, ఆశకార్యకర్తకు రూ.250 ప్రోత్సాహకంగా అందజేయనున్నారు. సాధారణ ప్రసవంతో తల్లి ఇచ్చే ముర్రుపాలు బిడ్డ తాగే అవకాశం ఉంటుందన్నారు. ముర్రుపాలు తాగడం వల్ల బిడ్డలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక ఉపయోగాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మొదటి గంటలో తల్లిపాలు తాగడంతో పాటు బిడ్డ వరుసగా ఆరునెలల పాటు తల్లిపాలు తాగడం వల్ల శిశు మరణాల రేటు 22 శాతం తగ్గించవచ్చని సర్వేలు చెబుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఈఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 9911 ఆపరేషన్లు ప్రసవాలు జరగగా, ఇందులో 6383 సాధారణ ప్రసవాలు జరిగాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా ప్రభుత్వం రూ. 3 వేల ప్రోత్సాహకం అందజేయనున్న నేపథ్యంలో సాధారణ ప్రసవాల సంఖ్య మరింత పెరగనున్నాయి.
సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ప్రతి బహిరంగ సమావేశాల్లో సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మహిళలకు వివరిస్తున్నారు. తమ బిడ్డలకు సాధారణ ప్రసవాలు చేయించాలని, ఆపరేషన్లు చేయించొద్దని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యు సదుపాయాలు ఉన్నాయని వివరిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సాధారణ ప్రసవాలు పెంచాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పటాన్చెరు, జహీరాబాద్లో అర్బన్ హెల్త్సెంటర్లతో పాటు 35 పీహెచ్సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. జనవరి నుంచి జూలై వరకు జిల్లాలో 37 దవాఖానల్లో 9911 ప్రసవాలు జరిగాయి. ఇందులో 6383 సాధారణ ప్రసవాలు కాగా, 3528 ఆపరేషన్లు జరిగాయి. ప్రభుత్వ దవాఖానలకు వచ్చే గర్భిణులకు సాధారణ ప్రసవం చేసేందుకు వైద్యులు ప్రాధామిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో 871, ఫిబ్రవరిలో 836, మార్చిలో 1084, ఏప్రిల్లో 907 సాధారణ ప్రసవాలు జరిగాయి. మే నెలలో 883, జూన్లో 880, జూలైలో 896 సాధారణ ప్రసవాలు జరిగాయి. సంగారెడ్డిలో జిల్లా కేంద్ర దవాఖానతో పాటు నారాయణఖేడ్, జోగిపేట, జహీరాబాద్, సదాశివపేట, పటాన్చెరు ఆరు దవాఖానల పరిధిలో ఏప్రిల్ నుంచి జూలై వరకు 4735 ప్రసవాలు జరిగాయి. ఇందులో నార్మల్ డెలివరీలు 2723 జరిగాయి. సీ సెక్షన్ ఆపరేషన్లు 2012 జరిగాయి. ప్రభుత్వ దవాఖానల్లో ఆపరేషన్లు తగ్గించి సాధారణప్రసవాలు చేయాలని వైద్య సిబ్బందికి సూచించామని డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవి తెలిపారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏరియా దవాఖానలు, సబ్ సెంటర్లలో కాన్పులు జరుగుతున్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలోని పిల్లికోటల్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో భవనాన్ని నిర్మించి.. కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మెదక్ ప్రభుత్వ దవాఖానల్లో ప్రతి నెలా 300లకు పైగా, నర్సాపూర్ ఏరియా దవాఖానల్లో 120, తూప్రాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 80 వరకు కాన్పులు జరుగుతున్నాయి. జిల్లాలో 24 గంటలు సేవలందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తొమ్మిది ఉండగా, నెలకు పది వరకు ప్రసవాలు నిర్వహిస్తున్నారు.
నార్మల్ డెలివరీలే లక్ష్యంగా..
సర్కారు దవాఖానల్లో నార్మల్ డెలివరీలు చేయాలన్నదే సర్కారు ఉద్దేశ్యం. ఇందుకోసం సర్కారు దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నది. ప్రైవేట్కు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయొద్దు. సర్కారు దవాఖానల్లోనే నార్మల్ డెలివరీలు చేస్తున్నాం. బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్ను బాలింతలకు అందజేస్తున్నాం.
-డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో, మెదక్