మనోహరాబాద్, జూన్6: పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలోని సోనోఫీ పరిశ్రమలో మంగళవారం పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, లేబర్ వెల్ఫెర్ కమిషన్ చైర్మన్ దేవేందర్రెడ్డి, కలెక్టర్ రాజర్షిషా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఫవర్ హాలిడేలు, కనీస వసతులు లేక ఎన్నో పరిశ్రమలు ఉత్పత్తి సామర్థ్యం పెంచలేక, ఎగుమతులు చేయలేక, జీతాలు చెల్లించలేక, అప్పులు కట్టలేక మూతపడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోందన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే అనుమతులు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, నీటి వసతితో పాటు సకల సదుపాయాలు కల్పించడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి పెరిగిందన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో దేశవిదేశాల నుంచి ఎన్నో పేరుమోసిన పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. నూతన పరిశ్రమల ఏర్పాటుతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ మెదడు కంప్యూటర్ లాంటిదని, ఎప్పుడూ రాష్ర్టాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచిస్తూనే ఉంటుందన్నారు. ఇక్కడి ప్రజలే కాకుండా దేశంలోని ఎన్నో రాష్ర్టాల ప్రజలు తెలంగాణలోని పరిశ్రమల్లో ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. వారి ఆధార్కార్డులను సైతం తెలంగాణ ప్రాంతాల్లోకి మార్చుకొని ఇక్కడే స్థిరపడుతున్నారంటే తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో అర్థమవుతుందన్నారు.
పారిశ్రామికవేత్తలు సమీప ప్రాంతాల్లోని గ్రామాలను దత్తత తీసుకొని సీఎస్ఆర్ ఫండ్స్ను వెచ్చింది గ్రామాల అభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, గడా ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాశ్, జిల్లా పరిశ్రమల సంస్థ మేనేజర్ కృష్ణమూర్తి, సీఎం కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్కుల మహిపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు మెట్టు బాలకృష్ణారెడ్డి, వెంకట్రామి రెడ్డి, ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.