మర్కూక్, జనవరి 27: దేశానికి పట్టుకొమ్మలు గ్రామ పంచాయతీలు అని, గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మర్కూక్ మండల పరిధిలోని పాములపర్తిలో శనివారం రాత్రి రూ.30లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. సర్పంచ్ల పదవీకాలం పొడిగించేందుకు అవకాశం లేనందున ప్రత్యేకాధికారుల పాలన తీసుకొస్తామన్నారు. ఐదేండ్ల పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్కు అభినందనలు తెలిపారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు దగ్గరలోనే ఉండడంతో తాగునీటి సమస్య ఉండదన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకును ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి రూ.30లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీవో బన్సీలాల్, ఎంపీపీ పాండుగౌడ్, డీపీవో దేవకీదేవీ, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సర్పంచ్ తిరుమల్రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్, నాయకుడు కనకయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.