అందోల్, జనవరి 25: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి బీఆర్ఎస్ సర్కార్ ఎంతో కృషి చేస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. అందులో భాగంగా మనఊరు-మనబడి కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. బుధవారం జోగిపేట ప్రభుత్వ పాఠశాలలో పూర్వ భాషోపాధ్యాయుడు శాస్ర్తుల రామనాథశర్మ స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు నిర్మించిన కళావేదికను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువు చెప్పిన పాఠశాలను మరిచి పోకుండా వారి తండ్రి జ్ఞాపకార్థం మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం మనఊరు-మనబడితో ఇప్పటికే అన్ని పాఠశాలల్లో తగిన వసతులు కల్పిస్తున్నదన్నారు. అనంతరం రామనాథశర్మ కుటుంబ సభ్యులను సన్మానించారు.
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నదని ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ అన్నారు. జోగిపేటలో రూ.20 లక్షలతో నిర్మించిన వాసవీ ఫంక్షన్ హాల్ రెండో అంతస్తును బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వాసవీ కల్యాణ మండపాన్ని సీఎం కేసీఆర్, అప్పుడు రవాణాశాఖ మంత్రి హోదాలో నిర్మించిందేనని, మళ్లీ ఆయన చొరవతోనే రెండో అంతస్తు నిర్మించుకోవడం అదృష్టమన్నారు. అందరూ ఏకతాటిపై ఉంటే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నైనా చేసుకోవచ్చన్నారు. కల్యాణ మండపానికి నిధులు అవసరమని ఆర్యవైశ్య సంఘం సభ్యులు కోరగా, అందుకు తగిన నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్ హామీనిచ్చారు.
18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి
18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జోగిపేటలో పాఠశాల, కళాశాల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటు సామాన్యుడి వజ్రాయుధమని, సరిగ్గా వినియోగించుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో అధికారులు ఓటు హక్కు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశారని, 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రజాప్రతినిధులు చూడాలన్నారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులు విద్యార్థులతో కలిసి అంబేద్కర్ సర్కిల్ వద్ద ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, ఎంపీపీ బాలయ్య, మాజీ ఎంపీపీ రామాగౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్లు మల్లికార్జున్, నారాయణ, పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డి, ఎంఈవో కృష్ణ, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు మాణయ్య, నరోత్తం, తహసీల్దార్ వెంకటేశం, ఎంపీడీవో సత్యనారాయణ, కౌన్సిలర్లు దుర్గేశ్, సురేశ్, నాయకులు రత్నంగౌడ్, అనిల్, తమ్మలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.