‘దేశంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది.. పక్కనే ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అక్కడ ఎందుకు లేవో ప్రజలు ఆలోచించాలి’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం జహీరాబాద్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, ఝరాసంగం మండలంలోని ఎల్గోయిలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం, మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆసరా పింఛన్ రూ. 2000 ఇస్తుంటే.. కర్ణాటకలో రూ. 600 ఇస్తున్నారని అన్నారు. తల్లీ బిడ్డ సంరక్షణ కోసం పట్టణంలో రూ. 12 కోట్లతో మాతాశిశు దవాఖానను 50 పడకలతో నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలో జహీరాబాద్, కోహీర్ సర్కారు దవాఖానల్లో ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్లను ప్రారంభిస్తామన్నారు. పేపరు లీకేజీ దొంగలను జైల్లో పెట్టడంతో పది పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. బావుల మోటర్లకు మీటర్లు పెట్టమన్నందుకు బీజేపీ ప్రభుత్వం రూ.30వేల కోట్లు నిలిపివేసిందని మండిపడ్డారు. మంజీరా కుంభమేళా పెద్ద ఎత్తున నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు కోరారు.
-జహీరాబాద్, ఏప్రిల్ 6
జహీరాబాద్, ఏప్రిల్ 6: ‘జహీరాబాద్ పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది. బీదర్లో కల్యాణ లక్ష్మి , షాదీముబారక్ పథకం ఉందా..?’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాలులో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు తమ ప్రభుత్వాలున్న రాష్ర్టాల్లో ఎక్కడైనా ఈ పథకం ప్రవేశపెట్టిందా అని ప్రశ్నించారు. దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, పక్కన ఉన్న బీదర్లో బీజేపీ సర్కార్ ఉంది. అక్కడ ఈ పథకం ఉందో లేదో తెలుసుకోవాలన్నారు.
మహిళల కష్టాలు తీర్చడం కోసం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. అర్హులైన పేదలకు సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు. గర్భిణులకు సర్కారు దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్తో పాటు అమ్మఒడి వాహనంలో ఇంటికి సురక్షితంగా పంపిస్తున్నామన్నారు. తల్లీ బిడ్డ సంరక్షణ కోసం జహీరాబాద్లో రూ. 12కోట్లతో మాతాశిశు దవాఖానను 50 పడకలతో నిర్మిస్తున్నామన్నారు. గర్భిణులకు ఆరోగ్యలక్ష్మితో పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు. గృహలక్ష్మి పథకంలో అర్హులైన వారికి ఇండ్లు నిర్మించుకునేందుకు రూ. 3 లక్షలు సాయం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా రూ. 122 కోట్లు ఆర్థిక సాయం చేశామన్నారు. బిలాల్పూర్, ఝరాసంగంలో ఆరోగ్య మహిళా క్లినిక్లు ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం సర్కారు దవాఖానలో వైద్య పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జహీరాబాద్, కోహీర్ సర్కారు దవాఖానల్లోనూ ప్రారంభిస్తామని తెలిపారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా వైద్య చికిత్సలు చేసి మందులు ఇస్తామన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించామన్నారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, జడ్పీ చైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ శరత్, ఆర్డీవో రమేశ్బాబు, తహసీల్దార్ జై. స్వామి, ప్రేంకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఝరాసంగం మండలంలోని ఎల్గొయిలో విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఎల్గొయిలో జరిగిన కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ సర్కారు బాగుందా… డబుల్ ఇంజిన్ సర్కార్ మంచిగుందా…
మొగుడంపల్లి మండలానికి రెండు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం ఉంది..అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది..అక్కడ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఉన్నాయా..? అని మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. గురువారం మొగుడంపల్లి మండలంలోని ధనసిరి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆసరా పింఛన్ తెలంగాణలో రూ. 2000 వేలు ఇస్తున్నం.. కర్ణాటకలో రూ. 600 ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గీతారెడ్డి గిరిజన తండాలను పంచాయతీలు చేస్తామని హామీ ఇచ్చారు.. మరి చేశారా అని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి గీతారెడ్డి జహీరాబాద్ను రెవెన్యూ డివిజన్ చేయలేకపోయిందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు రెవెన్యూ డివిజన్ కోసం కృషి చేసి సాధించారన్నారు. గీతారెడ్డి డాక్టర్గా ఉండి, రాష్ట్ర మంత్రిగా పని చేసినా కోహీర్లో సర్కారు దవాఖాన ఏర్పాటు చేయలేదన్నారు. ఎస్టీ గురుకుల పాఠశాల భవనం నిర్మాణానికి రూ. 4 కోట్లు మంజూరు చేశామన్నారు. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం బోధన చేస్తున్నామని అన్నారు.
కేంద్రం కక్షతోనే నిధులు ఇవ్వడం లేదు
పేపరు లీకేజీ దొంగలు జైల్లో ఉండడంతో పది పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు కృషి చేస్తుంటే బీజేపీ పేపర్లు లీకేజీ చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. వ్యవసాయ బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టమని తెగేసి చెప్పారనాన్నరు. దీంతో రూ. 30 వేల కోట్ల నిధులు నిలిపివేసిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతి ఇంట్లో ఆసరా పింఛన్లు అందించడంతో పాటు అంధత్వ నివారణే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఉచితంగా పరీక్షలు చేసి కంటి అద్దాలు అందిస్తూ చీకటి జీవితాల్లో వెలుగులు ప్రసాదిస్తున్నారని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా మేనమామ లాగా ఆర్థికసాయం చేస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం కొత్త జిల్లాలు, దవాఖానలు ఏర్పాటు చేశారని, వ్యవసాయానికి కాళేశ్వరం నుంచి సాగునీటిని తీసుకువస్తున్నామన్నారు. ధనసిరి గ్రామంలో విద్యుత్తు సబ్స్టేషన్ నిర్మాణం చేసి ప్రారంభించామని, మోతిమాత జాతర పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. మంజీరా కుంభమేళ భారీగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే మాణిక్రావు కోరిక మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. గులాబీ జెండాను కాపాడుకోవాలని, ప్రజలు ఆలోచన చేసి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ, ఆత్మీయ సమ్మేళనం సమన్వయకర్త, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు విజయ్మోహన్రెడ్డి, సయ్యద్ మోహినోద్దీన్, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.