మద్దూరు(ధూళిమిట్ట), మార్చి 10: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని గాగిళ్లాపూర్లో కొన్ని రోజులుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వరుసగా కాలిపోతుండడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. లోవోల్టేజీతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ట్రాన్స్ఫార్మర్లు మాటిమాటికి కాలిపోతున్నాయి. అక్రమ విద్యుత్ కనెక్షన్లతో సరిపడా సామర్థ్యం లేక ఇలా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. అక్రమ విద్యుత్ కనెక్షన్లను నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.
మరమ్మతుల కేంద్రం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల్లను తీసుకెళ్లి ఉచితంగా మరమ్మతులు చేసి తిరిగి బిగించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖపైనే ఉంటుంది. క్షేత్రస్థాయిలో మాత్రం ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కోసం రైతులు వేలాది రూపాయలు ఖర్చులు భరించాల్సి వస్తున్నది. ప్రధానంగా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను ట్రాక్టర్ ద్వారా ముస్త్యాలలోని మరమ్మతుల కేంద్రానికి తీసుకెళ్లేందుకు రూ. 2వేలు, మరమ్మతుల కేంద్రం వద్ద రూ. 2 వేలు, ట్రాన్స్ఫార్మర్ బిగింపు కోసం మరో రూ.2 వేలు ఖర్చు అవుతున్నాయని రైతులు తెలిపారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వరుసగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు ఖర్చుల నుంచి తమకు ఉపశమనం కలిగించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.