బీఆర్ఎస్తో ముమ్మర అభివృద్ధి రాష్ట్ర రాజకీయాల్లో సంగారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీకగా చెప్పవచ్చు. 2016 వరకు ఉమ్మడి మెదక్ జిల్లాకు పాలనా కేంద్రంగా సంగారెడ్డి కొనసాగింది. విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులకు నిలయంగా ఉన్న సంగారెడ్డి నియోజకవర్గం రాజకీయంగా చైతన్యవంతమైనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యవాదుల పెత్తనం ఉన్న రోజుల్లోనూ తెలంగాణ వాదం బలంగా వినిపించినది ఈ నియోజకవర్గం. తెలంగాణ ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ వెన్నంటే సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు నడిచారు. 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి హవా నడుస్తున్న సమయంలోనూ సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండు పర్యాయాలు గెలుపొందింది.
సంగారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ హయాంలోనే అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. 1957లో ఏర్పాటైన అసెంబ్లీ నియోజకవర్గం, 2016లో పునర్విభజన అయ్యింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు సంగారెడ్డి నియోజకవర్గం అంటే ఎంతో మక్కువ. టీడీపీ హయాంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఉన్న సమయంలో సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందింది. కేసీఆర్ సంగారెడ్డి మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గాల్లోని గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేపట్టారు. సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువును కేసీఆర్ అభివృద్ధి చేయించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికీ తన ప్రసంగాల్లో దానిని ఊటంకిస్తూ ఉంటారు. వందలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చే మల్కాపూర్ పెద్ద చెరువు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నది. ఆయకట్టు రైతులతో పాటు మత్స్యకారులకు ఈ చెరువు ఆదెరువుగా ఉంది.
తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి వేలకోట్ల నిధులు మంజూరు చేశారు. మరీ ముఖ్యంగా సంగారెడ్డి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలను నెరవేర్చారు. రూ.510 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం సంగారెడ్డిలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. రూ.40 కోట్లతో నర్సింగ్ కాలేజీ, రూ.25 కోట్లతో పారా మెడికల్ కాలేజీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంగారెడ్డిలో గిరిజన లా కాలేజీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో రూ.145 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టి ఇంటింటికీ తాగునీరు ఇచ్చారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో రూ.300 కోట్లకుపైగా నిధులు కేటాయించారు. సీఎం కేసీఆర్ హయాంలో సంగారెడ్డి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివచ్చాయి. తద్వారా యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి లభించింది. సంగారెడ్డి నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ సస్యశ్యామలం చేసేందుకు సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా గోదావరి జలాలు సంగారెడ్డికి రానున్నాయి. రూ.2,653 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. ఈ పథకం ద్వారా సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట, కంది మండలాల్లో 50వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. మల్లన్నసాగర్ నుంచి నేరుగా ఏర్పాటు చేస్తున్న సంగారెడ్డి కెనాల్ రీచ్ ద్వారా సంగారెడ్డి, కంది మండలాల్లో 10,484 ఎకరాలకు సాగునీరు అందనున్నది.
సంగారెడ్డి నియోజకవర్గం 1957లో ఏర్పాటైంది. సంగారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 1957 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) కలిసి ఆరుసార్లు గెలిచాయి. టీడీపీ, బీజేపీలు ఒక్కోసారి గెలుపొందగా.. బీఆర్ఎస్ రెండుమార్లు గెలుపొందింది. సంగారెడ్డి అసెంబ్లీ నుంచి నాలుగుసార్లు స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం విశేషం. కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.రామచంద్రారెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962 ఎన్నికల్లో పి.రామచంద్రారెడ్డి(కాంగ్రెస్), 1967లో నరసింహారెడ్డి(స్వతంత్ర), 1972లో పి.రామచంద్రారెడ్డి(కాంగ్రెస్), 1978లో నరసింహారెడ్డి(స్వతంత్ర), 1983లో పి.రామచంద్రారెడ్డి(కాంగ్రెస్) గెలుపొందారు. 1985లో పి.రామచంద్రారెడ్డి(కాంగ్రెస్ఐ), 1989లో పి.రామచంద్రారెడ్డి(కాంగ్రెస్), 1994లో కె.సదాశివరెడ్డి(టీడీపీ), 1999లో కె.సత్యనారాయణ(బీజేపీ), 2004లో బీఆర్ఎస్ నుంచి తూర్పు జయప్రకాశ్రెడ్డి(జగ్గారెడ్డి) ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో సంగారెడ్డి నియోజకవర్గం పునర్విభజన జరిగింది. 2009లో జరిగిన ఎన్నికల్లో తూర్పు జయప్రకాశ్రెడ్డి(కాంగ్రెస్) విజయం సాధించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున చింతా ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో తూర్పు జయప్రకాశ్రెడ్డి(కాంగ్రెస్) ఎమ్మెల్యేగా గెలిచారు.
సంగారెడ్డి నియోజకవర్గం నుంచి తొలి బీసీ ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ గెలుపొందారు. 1957లో సంగారెడ్డి నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అంతయ్య గెలిచారు. 1962 తర్వాత ఒక ఎమ్మెల్యే స్థానానికి ఎన్నికలు నిర్వహించడం ప్రారంభమైంది. 1962 తర్వాత 14 సార్లు ఎన్నికలు జరిగినా బీసీలు ఎవ్వరూ గెలుపొందలేరు. 2014లో టీఆర్ఎస్ బీసీ నేత చింతాప్రభాకర్కు అవకాశం ఇవ్వగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో చింతా ప్రభాకర్ స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి మూడోసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో చింతా ప్రభాకర్ ఓటమి పాలైనా సంగారెడ్డి నియోజకవర్గం వీడలేదు. కరోనా లాంటి విపత్కర సమయంలోనూ జనంతోనే ఉన్నారు. సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జగ్గారెడ్డి నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గం ముఖం చూడలేదు. హైదరాబాద్కు పరిమితమైన జగ్గారెడ్డి నియోజకవర్గ అభివృద్ధ్ది, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. చింతా ప్రభాకర్ ఇటీవల అనారోగ్యానికి గురైనా కోలుకున్న వెంటనే జనం మధ్యలో ఉన్నారు. ఒక్క ఫోన్ కాల్తో ప్రజా సమస్యలు పరిష్కరిస్తారన్న మంచిపేరు చింతా ప్రభాకర్కు ఉంది. సుమారు రూ.4500 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశారు.
సంగారెడ్డి అసెంబ్లీ ఏర్పడిన నాటి నుంచి నాలుగు పర్యాయాలు స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను పక్కనబెట్టి నియోజకవర్గంలోని ఓటర్లు నాలుగుసార్లు ఇండింపెండెంట్ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించి తమ రాజకీయ చైతన్యం చాటి చెప్పారు. తూర్పు జయప్రకాశ్రెడ్డి 2004లో మొదటిసారిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి తొలి బీసీ ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. సంగారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా పి.రామచంద్రారెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పి.రామచంద్రారెడ్డి పనిచేశారు.