మెదక్ అర్బన్, జనవరి 1: జిల్లాలో షీ టీమ్స్ నిఘా పెంచి పోకిరీల ఆట కట్టిస్తున్నాయి. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే ఈవ్ టీజర్ల భరతం పడుతున్నాయి. బస్టాండ్, రైల్వేస్టేషన్, సినిమా థియేటర్లు, కాలేజీలు, పార్కులు తదితర పబ్లిక్ ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే మేజర్, మైనర్ అనే తేడా లేకుండా చర్యలు తీసుకుంటున్నాయి. జిల్లాలో రెండు డివిజన్లలో షీ టీమ్స్ నిఘా కొనసాగుతున్నాయి. ఒకటి మెదక్ డివిజన్కాగా మరొకటి తూప్రాన్ డివిజన్ పరిధిలో షీ టీమ్స్ బృందాలు నిఘా పెడుతున్నాయి. ఒక్కో టీమ్లో ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్ ఉంటారు. జనం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్, దేవాలయాల వద్ద షీ టీమ్స్ బృందం మఫ్టీలో సంచరిస్తున్నారు.
ప్రేమ వేధింపులే ఎక్కువ
విద్యార్థినులను ప్రేమ పేరుతో వేధింపులు చేస్తున్న ఫిర్యాదులే షీ టీమ్స్కు ఎక్కువగా వస్తున్నాయి. పాఠశాల, ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు సీనియర్లు, జూనియర్లను వేధిస్తున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఫేస్బుక్, వాట్సాప్ పరిచయాలు, స్నేహం ముసుగులో ఎదురవుతున్న వేధింపులతో బాధితులకు షీ టీమ్స్ అవసరం ఏర్పడుతున్నది. ప్రేమించానంటూ బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నారని యువతులు, విద్యార్థినులు షీ టీమ్స్ను ఆశ్రయిస్తున్నారు. ఒంటరిగా పనుల కోసం బయటకు వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకొని కొన్నాళ్లు వెంటపడడం, మాటలు కలపడం, పరిచయం పెంచుకుని వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
జిల్లాలో కేసుల వివరాలు
మెదక్ మండలంలో ఒక అమ్మాయిని ఐదేండ్లుగా ప్రేమించి, తర్వాత నువ్వు నాకు అవసరం లేదని చెప్పడంతో ఆ యువతి ప్రేమ పేరుతో మోసం చేశాడని షీ టీమ్స్ బృందానికి కాల్ చేసింది. దీంతో వెంటనే షీ టీం బృందం బాధితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేసి బాధితురాలకి న్యాయం చేసేందుకు తోడ్పడింది. మెదక్లోని సిదార్థ్ పాఠశాల వద్ద అమ్మాయిల చూట్టూ ఆకతాయిలు బైక్పై స్టంట్స్ చేస్తూ వేధించడంతో వారి తల్లిదండ్రుల ద్వారా షీ టీమ్స్కు ఫిర్యాదు చేయడంతో షీ టీం బృందం పాఠశాల వద్ద ఉన్న సీసీ కెమెరాల ద్వారా అమ్మాయిల చూట్టూ తిరిగి స్టంట్స్ చేసిన అబ్బాయిలను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు.
అమ్మాయిలను వేధిస్తే జైలుకే: ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
ఆకతాయిలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం షీ టీం వ్యవస్థను ప్రవేశపెట్టింది. షీ టీం బృందం 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నది. అమ్మాయిలను ఎవరైనా వేధిస్తే వెంటనే షీ టీమ్కు సమాచారం అందించాలి. బస్టాప్, షాపింగ్ మాల్, రద్దీ ప్రదేశాల్లో షీ టీం బృందం మాఫ్టీలో తిరుగుతూ ఆకతాయిలపై నిఘా ఉంచి, ఎవరైనా అమ్మాయిలను వేధిస్తే వారిని జైలుకు పంపిస్తున్నది.