సంగారెడ్డి,(నమస్తే తెలంగాణ)/కంది, జూలై 18 : సాంకేతిక విజ్ఞానం, కళలు మన దేశానికి రెండు కండ్లు అని ప్రముఖ నాట్యకళాకారిణి పద్మవిభూషణ్ డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో 15వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్నాతకోత్సవ వేడుకల్లో 1398 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదుగురు విద్యార్థులకు బంగారు పతకాలను డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం, ఐఐటీహెచ్ పాలకవర్గం చైర్మన్ మోహన్రెడ్డి, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి ప్రదానం చేశారు. అనంతరం డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఐఐటీ పట్టభద్రులు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఐఐటీహెచ్ పాలకవర్గం చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్ 18 ఏండ్ల కాలంలో అనేక విజయాలు సాధించి, దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటిగా ఎదిగినట్లు చెప్పారు. పరిశోధన రంగంలో ఐఐటీహెచ్ అంతర్జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందిందన్నారు. ఐఐటీ పట్టభద్రులు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల గురించి కాకుండా నూతన ఆవిష్కరణలు, నూతన సంస్థలు, స్టార్టప్ కంపెనీలు నెలకొల్పడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా 1398 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసినట్లు చెప్పారు. ఐసీ డిజైన్ అండ్ టెక్నాలజీ బీటెక్ ప్రోగామ్ మొదటి బ్యాచ్, ఐఐటీహెచ్ డీకిన్ యూనివర్సిటీ జాయింట్ డాక్టోరల్ ప్రోగ్రామ్ నుంచి మొదటి బ్యాచ్ పట్టభద్రులు కావటం సంతోషంగా ఉందన్నారు. ఐఐటీ హైదరాబాద్ 18 ఏండ్లుగా అనేక విజయాలు సాధించినట్లు తెలిపారు. ప్రపంచస్థాయి వర్సిటీల ర్యాంకింగ్లో ఐఐటీహెచ్ 588 స్థానం సాధించినట్లు చెప్పారు.
ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రపంచంలోనే ఐఐటీహెచ్ 400వ ర్యాంక్ సాధించినట్లు గుర్తుచేశారు. స్టాన్ఫోర్ట్,ఎల్సివియేర్గ్ సైంటిస్టు జాబితాలో ఐఐటీహెచ్ నుంచి 31మంది ప్రొఫెసర్లకు 46 స్థానాలు దక్కినట్లు చెప్పారు. ఐఐటీహెచ్లో క్రిటికల్ మినరల్స్, డిఫెన్స్టెక్నాలజీ, ఫోటోనిక్స్, ఇండస్ట్రియల్ మెటలర్జీ, ఇంటిగ్రేటెడ్ కంప్యూటేషన్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్లో ఏఐ, కంప్యూటేషనల్ కెమికల్ ఇంజినీరింగ్ ప్రొడక్ట్బేస్డ్ పీహెచ్డీ వంటి కొత్త అకడమిక్ ప్రోగ్రామ్లు ప్రారంభించినట్లు తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రాడక్ట్బేస్ ఫెలోషిప్, బిజినెస్ మోడల్ యూజీ ప్రోగ్రామ్లు ప్రారంభిస్తామని చెప్పారు. బిల్ట్ పేరిట యూజీ విద్యార్థులు మరిన్ని పరిశోధనలు చేసేందుకు వీలుగా డిప్లొమా ప్రోగ్రామ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఐఐటీ విద్యార్థులు స్టార్టప్ కంపెనీలు ప్రారంభించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఐఐటీ హైదరాబాద్ తన అధికారిక సంస్కృత నినాదాన్ని స్నాతకోత్సవ వేడుకల్లో ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి ఐఐటీహెచ్ విడుదల చేశారు. ‘నవోన్మేశేషన దేశ నిర్మాణం’ పేరుతో ఐఐటీలోగో సంస్కృత లోగోను రూపొందించారు. సంస్కృత నినాదం సామాజిక సవాళ్లను ఎదుర్కొనేలా సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయాలన్న సంస్థ సంకల్పాన్ని ప్రతిభించడంతో పాటు వికసిత్ భారత్ నిర్మాణంలో తనవంతు పాత్ర తెలియజేసేలా సంస్కృత లోగోను రూపొందించినట్లు బీఎస్ మూర్తి తెలిపారు. స్నాతకోత్సవ వేడుకల్లో ఐఐటీ పట్టభద్రులు, తల్లిదండ్రులు, ఐఐటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
ఐఐటీ హైదరాబాద్లో 15వ స్నాతకోత్సవ వేడుకల్లో 1398 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. 489 మందికి బీటెక్, 528 మందికి ఎంటెక్, 191 మందికి పీహెచ్డీ, 111 మందికి ఎంఎస్సీ, 40 మందికి ఎం.డిజైన్, 18 మందికి బి.డిజైన్, 11 మంది ఎంఎ, ఆరుగురు ఎంఎస్, నలుగురికి డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అండ్ సైన్స్ పట్టాలు అందజేశారు. ఐదుగురు పట్టభద్రులకు బంగారు పతకాలు, 44 మందికి వెండి పతకాలు ప్రదానం చేశారు. బీటెక్లో ఓవరాల్ సీజీపీఏ సాధించినందుకు బొంతు మణి హేమంత్రెడ్డి (కంప్యూటర్సైన్స్ ఆండ్ ఇంజినీరింగ్)కి భారతరాష్ట్రపతి బంగారు పతకాన్ని డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం, బీవీఆర్మోహన్రెడ్డి, ఐఐటీ డైరెక్టర్ బీఎస్మూర్తి అందజేశారు. విద్యా, సహపాఠ్య కార్యకలాపాల్లో అత్యుత్తమ సీజీపీఏ సాధించిన ఫాతిమా రాఫీక్, ఎంఎస్సీ,ఎంఎలో అత్యధిక సీజీపీఏ సాధించిన మనీషా తంగదురై, ఎంటెక్, ఎండిజైన్లో అత్యధిక సీజీపీఏ సాధించిన సిద్దార్థ్ అగర్వాల్కు, విద్యా, సహా పాఠ్య కార్యకలాపాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గుణశేఖర్రెడ్డికి బంగారు పతకాలు ప్రదానం చేశారు.
అత్యధిక సీజీపీఏ సాధించిన వారికి ప్రదానం చేసే భారత రాష్ట్రపతి స్వర్ణపతకం నాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. 9.83 సీజీపీఏ సాధించడం వెనుక పట్టుదల, కృషితో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. మాది విజయవాడ దగ్గర నందిగామ. తండ్రి శ్రీనివాస్రెడ్డి న్యాయవాది, తల్లి గంగ భావాని గృహిణి.
– బొంతు మణి హేమంత్రెడ్డి, గోల్డ్ మెడలిస్ట్ విజయవాడ
ఐఏఎఎస్,ఐపీఎస్ కావాలన్నదే నా లక్ష్యం. మాది ఛతీశ్గఢ్ రాష్ట్రం. తండ్రి సునీల్ అగర్వాల్ బిజినెస్, తల్లి లతాఅగర్వాల్ గృహిణి. మధ్య తరగతి కుటుంబం మాది. తల్లిదండ్రుల దీవెనలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని సమాజ సేవ చేయాలన్నదే నా ఉద్దేశం.
– సిద్ధ్దార్థ్ అగర్వాల్ , గోల్డ్ మెడలిస్ట్, ఛత్తీస్గఢ్
మాది పేద కుటుంబం. తండ్రి థంగతురై క్యాబ్ డ్రైవర్, తల్లి మరియమ్మ గృహిణి. చాలా కష్టపడి నన్ను చదివించారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలన్నదే నా గోల్. మాది చెన్నై అయినా ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నా. అక్కడే టీచింగ్ జాబ్ చేస్తున్నా. యూఎస్ వెళ్లాలని లేదు.
-మనీషా, గోల్డ్ మెడలిస్ట్, చెన్నై
పీజీ విభాగంతో పాటు రూరల్ డెవలప్మెంట్ కోసం చేసిన కృషికి గోల్డ్మెడల్ రావడం ఆనందంగా ఉంది. మాది హైదరాబాద్. తండ్రి లేడు. తల్లి గీత ప్రోత్సాహంతో ఇంత వరకు వచ్చా. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది.
– గుణశేఖర్రెడ్డి, గోల్డ్ మెడలిస్ట్, హైదరాబాద్
సంగారెడ్డికి చెందిన కోవూరి హరిణి బీటెక్ పట్టా అందుకుంది. ఐఐటీ హైదరాబాద్లో మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తి చేసింది. బీటెక్ పట్టా అందుకుంది. ఐఐటీ హైదరాబాద్లో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇండస్ అండ్ కంపెనీలో ఉద్యోగం సాధించింది.
– హరిణి కోవూరి, సంగారెడ్డి