తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికీ సీఎం కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తామని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని 1, 2 వార్డుల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో పద్మారెడ్డికి ప్రజలు డప్పుచప్పుళ్లు, మంగళహారతులు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో వస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాయని, రైతులు ఆలోచించి ఓటేయాలని కోరారు. సీఎం కేసీఆర్ మెదక్ వచ్చినప్పుడు అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారన్నారు. ఎక్కడి నుంచో వచ్చి గొడవలు పెడతాం, కొట్లాటలు పెడతాం అంటే ఊరుకోమని హెచ్చరించారు.
మెదక్ అర్బన్, నవంబర్ 1: బీఆర్ఎస్ అధికారంలో వస్తే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికీ కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని 1, 2 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఆమెకు ప్రజలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లు, బతుకమ్మ ఆటపాటలు, బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు, ర్యాలీల మధ్య ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బీమా పథకంతో రాష్ట్రంలోని 93 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపిస్తే ఐదు నెలలకే ఆ పార్టీ పాలన చేతులెత్తేసే పరిస్థితి నెలకొన్నదన్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడకు వచ్చినప్పుడు మెదక్ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారరని గుర్తు చేశారు. మైనంపల్లి హన్మంతరావు కొట్లాటలు పెట్టడం మల్కాజ్గిరిలో నడుస్తది కానీ, మెదక్ నియోజకవర్గంలో కుదరదన్నారు. నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలు ఆలోచించి ఓటేయాలని, కాంగ్రెస్కు ఓటస్తే మళ్లీ రా్రష్ట్రంలో కరెంటు కష్టాలు వస్తాయన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి నుంచి రూ.5 వేల పింఛన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్చైర్మన్ మల్లికార్జున్గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, వార్డు కౌన్సిలర్లు వేదవతి, విశ్వం, నర్వ లక్ష్మీనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.