Rashi Vanam | సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం హరితహరం. దాంట్లో భాగమే రాశివనం. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచేలా అధికారులు అవగాహన కల్పించి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. రాశివనంలో మానవుల రాశిని బట్టి 12 రకాల మొక్కలను అటవీ అధికారులు పెంచారు. ఏ రాశివారికి ఏ మొక్క నాటితే చెడు తొలగిపోయి మంచి జరుగుతుందో వాటినే రాశీవనాల్లో పెంచారు. గజ్వేల్ పట్టణ సమీపంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కులోని రాశివనంలో మానవుల రాశులను బట్టి మొక్కలను పెంచారు.
జీవన శైలిలో మార్పు కోసం.. దైవిక సిద్ధాంతం ప్రకారం…
దైవిక సిద్ధాంతం ప్రకారం ప్రకృతి సిద్ధమైన మొక్కలతో మానవ జీవన శైలిలో మార్పు వచ్చే మొక్కలను అటవీ అధికారులు పెంచారు. గజ్వేల్ పట్టణ సమీపంలోని అర్బన్ పార్కులో ప్రభుత్వ సూచనల మేరకు 36 గుంటల విస్తీర్ణంలో 12 రాశుల వారికి సంబంధించిన 108 మొక్కలను పెంచారు. ఈ రాశివనంలోకి ప్రవేశించినవారు వారి రాశిఫలం ఆధారంగా ఆ మొక్కల ముందు నిలబడితే వారిలో ఉన్న చెడు తొలగిపోయి మంచిని ఆస్వాదించే అవకాశాలుంటాయి. ఒక్కో రాశి వారి కోసం 9 ఒకే రకమైన మొక్కలను ఇందులో నాటారు. 12 రాశుల వారికి చెందిన మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఏవరైనా రాశులు తెలియనివారు ఉంటే రాశివనం మధ్యలో ఏర్పాటు చేసిన గజేబోలో కుర్చుంటే సరిపోతుంది. తద్వారా చుట్టూ ఉన్న మొక్కలను ఆస్వాదించే అవకాశం ఉండడంతో పాటు అక్కడ ఎంతో ప్రశాంతత లభిస్తుంది. రాశివనాన్ని 2018, జూన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఒక్కో రాశికి ఒక్కో రకం మొక్క..
ఈ రాశివనంలో కన్య రాశి వారి కోసం మామిడి, తుల రాశి-పొగడ, ధనుస్సు-రావి, వృశ్చిక-సండ్ర, మకర-జిట్రేగి, కుంభ-జమ్మి, మీన-మర్రి, మేష-ఎర్రచందనం, వృషభ-ఎడాకులపాల, మిథున-పనస, కర్కాటక-మోదుగ, సింహ-కాలిగొట్టు మొక్కలున్నాయి. ఈ మొక్కల ముందు ఉదయం లేవగానే కాసేపు నిలబడితే వారిలోని చెడుపోయి మంచిని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. రాశులకు అనుగుణంగా పండితులు, జ్యోతిష్యులు తెలిపిన విధంగా రాశివనంలో మొక్కలను పెంచారు. ఈ రాశివనంలోని కాలిగొట్టు, ఎర్రచందనం, జిట్రేగి, సండ్ర మొక్కలు చాలా అరుదుగా ఉంటాయి.
ఇండ్లల్లోనూ రాశులకు అనుగుణంగా మొక్కల పెంపకం..
అధునికత, సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నా సనాతన ధర్మానుసరణ భారతీయ సంస్కృతిలో భాగమేనని చెప్పక తప్ప దు. ఈ రోజుల్లో అవసరాలను బట్టి తమ రాశులకు అనుగుణంగా ఇంట్లోనే మొక్కలను పెంచుకుంటున్నారు. పట్టణాల్లో చాలామంది ఇంటి పరిసరాల్లో రాశులను పోలిన మొక్కలను పెంచుకొని ఉదయం లేవగానే వాటిని చూస్తూ కాసేపు అక్కడే నిలబడుతుంటారు. దోషాలు తొలగిపొయి జీవితంలో మంచి జరుగు తుందని రాశుల ఆధారంగా మొక్కలను పెంచుతున్నారు.
రాశివనంలో ప్రశాంతత..
గజ్వేల్ అర్బన్ పార్కు ప్రారంభంలోనే విశాలమైన ప్రదేశంలో 12 రకాల రాశుల వారికి చెందిన మొక్కలను పెంచాం. రాశివనంలోకి ప్రవేశించగానే ప్రతి ఒక్కరికి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. వివిధ రాశుల వారు ఆయా మొక్కల ముందు నిలబడితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాశులు తెలియనివారు రాశివనం మధ్యలో నిర్మించిన గజేబోలో కూర్చుంటే ప్రకృతి సిద్ధమైన వాతావరణం ఆస్వాదించేందుకు వీలుగా ఉంటుంది.
– కిరణ్కుమార్, అటవీ రేంజ్ అధికారి, గజ్వేల్