నర్సాపూర్, ఏప్రిల్ 29: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఆశపడి ఓటేస్తే అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం మోసం చేసిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. సోమవారం నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్, తిర్మలాపూర్, బ్రాహ్మణపల్లి, గొల్లపల్లి, లింగాపూర్, అచ్చంపేట్, నారాయణపూర్, మంతూర్, రెడ్డిపల్లిలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఆమె మాట్లాడుతూ.. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజలకు, రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని, రామమందిరం పేరుతో ఓట్లను దండుకోవాలని చూస్తున్నదన్నారు.
కేసీఆర్ యావత్ హిందూ సమాజం గర్వించేలా యాదాద్రి ఆలయాన్ని నిర్మించారన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తుందన్నారు. వెంకట్రామిరెడ్డి రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తానని ప్రకటించారని, అతన్ని గెలిపించుకుందామని సునీతా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, సుధాకర్రెడ్డి, ప్రసాద్, శ్రీనివాస్, కొండల్, ఆంజనేయులు, నర్సింగ్, శ్రీనివాస్గౌడ్, శ్రీరాములు, కరుణాకర్, రవి, సేనాధిపతి, మానయ్య పాల్గొన్నారు.