తూప్రాన్, ఫిబ్రవరి 2: గురుకుల పాఠశాలలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి అల్లాపూర్ టోల్ప్లాజా సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉండగా, అవి పనిచేయకపోవడంతో మరమ్మతుల కోసం రూ. 50 వేల నగదును అందజేశారు.
750 బెడ్లు, పాఠశాల ప్రహరీ, లైబ్రరీ, ఓపెన్ జిమ్ సౌకర్యాలను కల్పించాలని, అవసరమైతే సీఎస్ఆర్ నిధులను సమకూర్చుకోవాలని ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. విద్యార్థులు ఆరుబయట చదువుకోవడాన్ని గమనించి అదనపు తరగతి గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గురుకులంలో సమస్యలను ఫోన్ ద్వారా కలెక్టర్ రాజర్షి షా దృష్టికి తీసుకువెళ్లారు. కొద్ది రోజుల తర్వాత ఆకస్మిక తనిఖీ చేస్తానని, అప్పటిలోగా పాఠశాల రూపురేఖలు మారాలని అన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జై చంద్రా రెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో అరుంధతి, మున్సిపల్ కమిషనర్ ఖాజామొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.