దుబ్బాక/ దుబ్బాక టౌన్/ మిరుదొడ్డి/ తొగుట, నవంబర్ 26: ‘దుబ్బాక అంటే.. ఉద్యమాల గడ్డ. ఎన్నో ఉద్యమాలకు నిల యం.. ఈ ప్రాంత ప్రజలు చాలా విజ్ఞులు. ఇక్కడ విద్యనభ్యసించిన మన సీఎం కేసీఆర్కు దుబ్బాక అంటే ఎనలేని ప్రేమ’ అని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్తోనే దుబ్బాక అభివృద్ధి సాధ్యమన్నారు. దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేకనే.. నాపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. భగవంతుడి దయ, మీ అందరి ఆశీస్సులతో బతికి మీ ముందుకొచ్చానన్నారు. ఇప్పటి వరకు ఇంజక్షన్ తీసుకున్న దాఖలాలు లేవని, అలాంటి నేను 15 రోజులుగా దవాఖానలో నరకయాతన అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాకలో బీఆర్ఎస్ని ఎదుర్కోలేక నన్ను చంపాలని చూశారని, దుబ్బాక వేంకటేశ్వరుడి దయవల్ల, దుబ్బాక ప్రజల ఆశీస్సులతో మళ్లీ బతికి మీ వద్దకు వచ్చానని తెలిపారు. నేను దవాఖానలో ఉంటే… నాకు అండగా నిలిచి ప్రచారంలో నేను లేని లోటును పార్టీ కార్యకర్తలు తీర్చారని చెప్పారు.
గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారన్నారు. ఇందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. నా కోసం పార్టీ శ్రేణులు చాలా కష్టపడ్డారని వివరించారు. నాకిది పునర్జన్మ అని, నా శేష జీవితాన్ని దుబ్బాక ప్రజల సేవకే అంకితమవుతానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రెండుసార్లు ఎంపీగా అవకాశం ఇచ్చారని, ఇప్పుడు సొంత గడ్డ దుబ్బాకకు సేవ చేసే భాగ్యం కల్పించేందుకు మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని ఇందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో సీఎం కేసీఆర్కు అణువు అణువూ తెలుసన్నారు. ఆయన దుబ్బాకలో చదువుకున్న విద్యార్థిగా ఈ ప్రాంత ముద్దు బిడ్డగా పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి స్వల్ప ఓట్లతో బీజేపీ రఘునందన్రావు గెలిచాడని, ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం రైతుల వద్దకు వెళ్లి మీ భూములు పోతాయంటూ దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. నాపై హత్యాయత్నం జరిగి దవాఖానలో ఉంటే… కోడి పందెం కత్తి, బూటకపు దాడి అంటూ సోషల్ మీడియాలో నీచ రాజకీయం చేశాడని విమర్శించారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ప్రభాకర్రెడ్డి తెలిపారు. గత తొమ్మిదేండ్లుగా ఎంపీగా మెదక్ పార్లమెంట్ ప్రజలకు సేవలందించానని. ఎక్కడ ఎలాంటి పొరపాటు చేయలేదని, పైసా కూడా తప్పు చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని ఏనాడూ వమ్ము చేయలేదన్నారు. ఆయన ఆశీస్సులతో దుబ్బాక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవచేసే అవకాశం కల్పించారని తెలిపారు. దుబ్బాకలో పలు సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని సీఎం కేసీఆర్ను సభావేదిక ద్వారా కోరారు. దుబ్బాక ప్రజల చిరకాల వాంఛ .. మీ చేతులమీదుగా దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. దుబ్బాక మున్సిపాలిటీకి ఔటర్ రింగ్రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గంలో పెద్ద మండలాలైన దౌల్తాబాద్, మిరుదొడ్డి, చేగుంటలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి, విద్యార్థులకు ఉన్నత విద్యా సౌకర్యం కల్పించాలని కోరారు. మీ (సీఎం కేసీఆర్) సహకారంతో దుబ్బాకలో వేంకటేశ్వర ఆలయం నిర్మించుకున్నామని తెలిపారు. ఆ దేవుడి కృపతోనే నేను ఆరోగ్యవంతుడిగా ప్రజల ముందుకొచ్చానని తెలిపారు. ఆ ఆలయం మాదిరిగా దుబ్బాక రేకులకుంట మల్లికార్జున దేవాలయం, కూడవెల్లి రామలింగేశ్వర దేవాలయాలను అభివృద్ధి పర్చి పర్యాటక కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని కోరారు. దుబ్బాకలో ఐవోసీ భవనంతో పాటు నియోజకవర్గంలో పలు పీఆర్, ఆర్అండ్బీ రోడ్లు కావాలని కోరారు.