చేర్యాల, జనవరి 11: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ హుండీలను మంగళవారం లెక్కించారు. మహా మండపంలో ఆలయ ఈవో బాలాజీ ఆధ్వర్యంలో సిద్దిపేట వేంకటేశ్వర స్వామి ఆలయ ఈవో విశ్వనాథశర్మ పర్యవేక్షణలో మంగళవారం లెక్కింపు చేపట్టారు. గతేడాది నవంబర్ 18న హుండీ లెక్కింపు జరిగింది. తిరిగి మంగళవారం మళ్లీ ఆలయంలోని 14 హుండీలను ఆలయ అర్చకులు, ఉద్యోగులు, తాత్కాలిక సిబ్బంది, రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన సత్యసాయి భజన మండలి సేవా సమితి సభ్యులతో లెక్కించారు. లెక్కింపులో 53 రోజులకు గాను రూ. 1,03,92,693 నగదుతో పాటు 164 గ్రాముల మిశ్రమ బంగారం, 9కిలోల 600 గ్రాముల మిశ్రమ వెండి వచ్చింది. భక్తులు 25 విదేశీ కరెన్సీ నోట్లు, 27 క్వింటాళ్ల మొక్కుబడి బియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో విలేకరులతో మాట్లాడుతూ ఆలయ హుండీ ఆదాయాన్ని ఏపీజీవీబీలో జమ చేశామన్నారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, మల్లన్న ఆలయ ధర్మకర్తలు, పర్యవేక్షకుడు నీల శేఖర్, ఆలయ స్థానాచార్యుడు పడిగన్నగారి మల్లయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. చేర్యాల సీఐ శ్రీనివాస్రెడ్డి పర్యవేక్షణలో కొమురవెల్లి ఎస్సై చంద్రమోహన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.