జహీరాబాద్, మే 10 : పెళ్లి వేడుకలు ముగించుకొని, తిరిగి ఇంటికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కుటుంబసభ్యులో ఒకరు మంటలో సజీవ దహనమయ్యా డు. మంగళవారం తెల్లవారు జామున 65వ జాతీయ రహదారి పై జహీరాబాద్ బైపాస్ రోడ్డులో అల్గోల్ చౌరస్తా వద్ద ప్రైవేట్ టావెల్స్ బస్సు, మిని గూడ్స్ వాహనం ఢీ కోవడంతో ఈ ప్రమాదం జరిగింది. జహీరాబాద్ పోలీసులు, ప్రత్యక్ష సాక్షల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర లాత్తూర్కు చెందిన షేక్ కలీం, షేక్ ఇమామ్, షేక్ సమీర్, సిబ్బుకుమార్సింగ్(డ్రైవరు)తో హైదరాబాద్ నుంచి లాతూర్కు అశోక్ లేలాండ్ మినీ గూడ్స్ వాహనం లో పెళ్లి వస్తువులతో వెళుతున్నారు. అల్గోల్ చౌరస్తా వద్ద బీదర్ వైపు మినీ గూడ్స్ వాహనం మలుపుతుండగా, ముంబాయి నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు అతివేగంతో వచ్చి ఢీకొంది. మినీ గూడ్స్ వాహనాన్ని ట్రావెల్స్ బస్సు ఢీ కొనడంతో జాతీయ రహదారి పై బోల్తా పడింది.
బోల్తా పడిన మినీ గూడ్స్ వాహనం డీజీల్ ట్యాంకు పగిలిపోవడంతో మంటలు వ్యాపించాయి. మంటలు ఒకేసారి వ్యాప్తి చెందడంతో మినీ గూడ్స్ వాహనంలో వెనుక వైపు నిద్రలో ఉన్న సమీర్(28) సజీవదహనమయ్యాడు. ట్రావెల్స్ బస్సు అద్దాలు పగిలిపోవడంతో క్లీనర్ నగేశ్ గాలిలో ఎగిరి రోడ్డు పై పడిపోయాడు. అతడికి మంటలు అంటుకొని తీవ్ర గాయలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఐదుగురికి గాయలవడంతో గాంధీ దవాఖానకు తరలించారు. ట్రావెల్స్ బస్సుకు మంటలు వ్యాప్తి చెందకుండా అగ్ని మాపక శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ట్రావెల్స్ బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో కిటికిలో నుంచి బయటకువచ్చారు.
పెండ్లి ముగించుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్లోని ముషీరాబాద్లో పెండ్లి వేడుకలను సోమవారం రాత్రి ముగించుకొని లాతూర్కు వెళ్తుండగా అల్గోల్ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం 4.30 గం టల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. పట్టణ ఎస్సై శ్రీకాం త్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అగ్ని మాపక అధికారులు మంటలు ఆర్పివేశారు. లాతూర్కు చెందిన షేక్ కలీం, షేక్ ఇమామ్, సిబ్బుకుమార్సింగ్(డ్రైవరు)తో పాటు ట్రావెల్స్ బస్సులో ఉన్న కొంత మందికి గాయలయ్యాయి. మృతుడు సమీర్(28) వస్తువుల కోసం గూడ్స్ వాహనంలో వెనుకవైపు కుర్చున్నారన్నారు. డ్రైవర్ సిబ్బుకుమార్సింగ్, షేక్ కలీం, షేక్ ఇమామ్కు తీవ్ర గాయలవడంతో గాంధీ దవాఖానకు తరలించారు. ట్రావెల్స్ బస్సు క్లీనర్కు నగేశ్ను మెరుగైన వైద్యం కోసం గాంధీ దవాఖానకు తరలించారు.
అతివేగం, అజాగ్రత్తతో ప్రమాదం
65వ జాతీయ రహదారిపై అతివేగంతో పాటు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న జహీరాబాద్ డీఎస్పీ రఘు, తహసీల్దార్ నాగేశ్వర్రావు, సీఐ తోట భూపతి, ఎంవీఐ జయప్రకాశ్రెడ్డి, ఎస్సై శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంపై విచారణ చేశారు. అగ్ని మాపక శాఖ అధికారులు సకలంలో చేరుకోవడంతో భారీ ప్రమాదం తప్పిందని పలువురు తెలిపారు. సమీర్ మృతదేహానికి జహీరాబాద్ సర్కార్ దవాఖానలో పోస్టు మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. పట్టణ ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
హత్నూర, మే 10 : వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందిన సంఘటన హత్నూర మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, హత్నూర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా దమన్నపల్లి గ్రామానికి చెందిన అక్కినేని రోషయ్య(42) నెలక్రితం మండలంలోని ఎన్సీఎల్ పరిశ్రమలో వంటమనిషిగా చేరాడు. మంగళవారం వంట సరుకుల కోసం ద్విచక్రవాహనంపై తోటి వ్యక్తి భూమిజయరాంరెడ్డితో కలిసి దౌల్తాబాద్ వెళ్లి వస్తుండగా మల్కాపూర్ శివారులోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి హెచ్చరిక బోర్డుకు ద్విచక్రవాహనం తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. అదేవిధంగా చింతల్చెరు గ్రామానికిచెందిన మద్దూరి వీరస్వామి(40) తన ద్విచక్ర వాహనంపై దౌల్తాబాద్ వెళ్లి వస్తుండగా డీసీఎం వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాలను నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఉద్యోగిని మృతి
పటాన్చెరు, మే 10 : రోడ్డు ప్రమాదంలో ఉద్యోగిని మృతి చెందిన సంఘటన ముత్తంగిలో చోటు చేసుకుంది. పటాన్చెరు పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలివి. పటాన్చెరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మాసిస్ట్గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి(34) ముత్తంగిలో నివసిస్తున్నారు. జ్యోతి మంగళవారం స్కూటీ పై ముత్తంగినుంచి పటాన్చెరు వస్తుండగా అతివేగంగా రింగురోడ్డుపైకి వెళ్తున్న ట్రాలర్ ఢీ కొట్టింది. జ్యోతి స్కూటీపై కిందపడటంతో ట్రాలర్ కొంతదూరం ఈడ్చుకుని పోయింది. ట్రాలర్ టైర్లు పైకి ఎక్కడంతో జ్యోతి తీవ్ర గాయాలతో మృతి చెందింది. పటాన్చెరు పోలీసులు జ్యోతి మృతదేహాన్ని పటాన్చెరు ఏరియా దవాఖానకు తరలించారు. జ్యోతి కుటుంబ సభ్యులను డిప్యుటీ డీఎంఅండ్ హెచ్వో డాక్టర్ కే నాగనిర్మల కలిసి సంతాపం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సంతాపం
రోడ్డు ప్రమాదంలో ఫార్మసిస్ట్ జ్యోతి మృతి చెందటంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జ్యోతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జ్యోతి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.