చేర్యాల, జనవరి 1 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 20వేల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు కావడంతో చేర్యాల, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, జనగామ, బచ్చన్నపేట, కరీంనగర్ తదితరల ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. భక్తులు శనివారం ఉదయం నుంచే మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ నిర్వహణలో ఉన్న గదులతో పాటు ప్రైవేటుగా ఉన్న గదులు అద్దెకు తీసుకుని బస చేశారు.
ఆదివారం వేకువజామునే నిద్రలేచి కోనేటిలో స్నానం ఆచరించి, స్వామివారి దర్శనం కోసం క్యూలో గంటల పాటు వేచి ఉండి స్వామి వారిని దర్శించుకుని కోరికలు తీర్చాలని వేడుకున్నారు. కొంతమంది భక్తులు అర్చన, ప్రత్యేక పూజలు, కేశఖండన, నజరు, మహామండప, చిలుకపట్నం, బోనం, టెంకాయలు, హుం డీలో కానుకలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు భక్తులు తమ మొక్కులు తీర్చాలని గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు, సం తానం కలుగాలని మరికొందరు ఒల్లుబండ పూజ లు, రాతిగీరల వద్ద మొక్కులు, కోడెను కట్టివేసి స్వామి వారిని వేడుకున్నారు. భక్తులకు ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, డైరెక్టర్లు, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సూపరింటెండెంట్లు నీల శేఖర్, శ్రీనివాస్శర్మ, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు సేవలు అందించారు.
వర్గల్ ఆలయాల్లో
వర్గల్, జనవరి 1 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి, వర్గల్ శ్రీవిద్యాసరస్వతీ అమ్మవారి ఆలయాలు ఆదివారం భక్తులతో పోటెత్తాయి. ఉదయం నుంచి ఆలయాల్లో దేవతామూర్తుల దర్శనంకోసం పెద్దసంఖ్యలో బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయాల నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు ఏర్పాట్లు చేశారు. నాచగిరిక్షేత్రంలో నేడు జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ కమిషనర్ కట్టా సుధాకర్రెడ్డి తెలిపారు.
మల్లన్నను దర్శించుకున్న కలెక్టర్
కొమురవెల్లి మల్లికార్జున స్వామిని కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ దంపతులు నూతన సంవత్సరం రోజున దర్శించుకున్నారు. కలెక్టర్కు ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్యల ఆధ్వర్యంలో ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మల్లన్నను దర్శించుకున్న కలెక్టర్ దంపతులు అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగ ఆలయ చైర్మన్ మల్లన్న ఆలయ చరిత్ర ప్రతి ఆదివారం క్షేత్రానికి వచ్చే భక్తులు సంఖ్యతో పాటు కొనసాగుతున్న అభివృద్ధి పనులను తెలిపారు. కలెక్టర్ వెంట ఆలయ డైరెక్టర్లు కందుకూరి సిద్దిలింగం, సూటిపల్లి బుచ్చిరెడ్డి, కాసర్ల కనకరాజు తదితరులు ఉన్నారు.