హుస్నాబాద్ మార్కెట్ నుంచి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి
గతేడాది నుంచి అందుబాటులోకి వచ్చిన మార్కెట్ సౌకర్యం
తగ్గిన రవాణా, దూర భారం
సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
హుస్నాబాద్ టౌన్, మే 7: వ్యవసాయంతో పాటు వందలాది ఎకరాల పండ్ల తోటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ నిలయంగా మారింది. ఒకనాడు బత్తాయి తోటలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతం, రానురాను ఆదాయాన్ని ఎక్కువగా అందించే మామిడి తోటలపై రైతులు దృష్టిపెట్టారు. మామిడి తోటల పెంపకంతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుండటంతో తోటల సాగు హుస్నాబాద్ ప్రాతంలో ఏటేటా పెరుగుతున్నది.
మామిడి మార్కెట్ ప్రారంభం…
హుస్నాబాద్ ప్రాంతంలో దాదాపు 700 ఎకరాలకు పైగా మామిడి తోటల పెంపకం సాగుతున్నది. స్థానికంగా బంగినపల్లి, దసిరి, ఇమాయిత్ తదితర రకాల మామిడి తోటలు ఇక్కడ పెంచుతున్నారు. మామిడి తోటలు అధికంగా ఉన్నప్పటికీ, స్థానికంగా మామిడి మార్కెట్ లేకపోవడంతో రైతులు వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో గతేడాది మామిడి మార్కెట్ను హుస్నాబాద్లో ప్రారంభించడంతో రైతులకు రవాణా, దూర, ఖర్చుల భారం తగ్గింది. స్థానికంగానే మామిడికాయలు కొనుగోళ్లు ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టన్నుకు రూ.30వేల రూ.55వేల వరకు..
మామిడికాయ మార్కెట్ ప్రారంభం కావడంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు తమ పంటను అమ్ముకునేందుకు హుస్నాబాద్ మార్కెట్కు తరలివస్తున్నారు. ఈ ఏడాది పలు కారణాలతో మామిడిపంట తీవ్రంగా దెబ్బతిన్నది. వేలాది టన్నుల మేర రావాల్సిన మామిడికాయ ఈ ఏడాది వందలకు పరిమితమైంది. దీంతో గతేడాది రోజుకు 10టన్నుల వరకు మామిడి రాగా, ఈ ఏడాది రోజుకు ఆరు టన్నుల మామిడి మార్కెట్కు తరలివస్తున్నది. కరీంనగర్, వరంగల్ మార్కెట్లలో లభిస్తున్న ధరలతో సమానంగా రైతులకు ధర లభిస్తున్నది. ఎక్కువ శాతం బంగినపల్లి మామిడి మార్కెట్కు వస్తుండ గా, టన్నుకు రూ.30వేల నుంచి రూ.55వేల వరకు స్థానికంగా ధర పలుకుతున్నది.
వివిధ రాష్ర్టాలకు మన మామిడి…
మామిడి తోటల పెంపకంతో పాటు పంట దిగుబడికి మన తెలంగాణ నుంచే అధికంగా ఉంటున్నది. వివిధ రాష్ర్టాలతో పాటు విదేశాల్లో సైతం మన మామిడి పండ్లకు భలే డిమాండ్ ఉన్న నేపథ్యంలో స్థానికంగా కొనుగోలు చేసిన బంగినపల్లి మామిడి పండ్లను ఎప్పటికప్పుడు కూలీలతో బుట్టల్లో ప్యాకింగ్ చేయిస్తున్నారు. ప్యాకింగ్ చేసిన మామిడి కాయలను హర్యానా, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కు లారీల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. రోజు మార్కెట్కు వస్తున్న మామిడికాయను ఎప్పటికప్పుడు ఆయా రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు.
రేట్ మంచిగనే ఉన్నది..
ఈసారి కాత బాగ రాలేదు. కానీ, మంచి రేట్ ఉన్నది. హుస్నాబాద్ల మార్కెట్ పెట్టినంక ఈడనే అమ్ముతున్నం. వరంగల్ కాడికి పోతే రోజుంతా ఆడనే ఉండాలే. ఖర్చులు కూడా మస్తు అయితుండే. ఈడ మార్కెట్ పెట్టుడు రైతుకు సౌకర్యంగా ఉంది. మార్కెట్ పెట్టుడు రైతులకు నయమైంది.
– పిట్టల శ్రీనివాస్, రైతు, కేశ్వాపూర్, అక్కన్నపేట మండలం (సిద్దిపేట జిల్లా)
మంచి ధరను చెల్లిస్తున్నాం..
హుస్నాబాద్ మార్కెట్లో మంచి ధరను చెల్లిస్తున్నాం. గతంలో రైతులు మామిడిని అమ్ముకునేందుకు వరంగల్, కరీంనగర్ పోయేటోళ్లు. మేం మార్కెట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇక్కడనే అమ్ముకునేందుకు వస్తున్నారు. రోజుకు 6 టన్నుల మామిడికాయలు కొంటున్నం. వాటిని ఎప్పటికప్పుడు లారీల్లో ఎగుమతి చేస్తున్నం.
– గురాల సందీప్, కమీషన్ ఏజెంట్, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా)
రైతులకు బాగా లాభమైంది
హుస్నాబాద్ మార్కెట్లో మామిడికాయల కొ నుగోలు చేయిస్తున్నం. ఇది ఇక్కడి రైతులకు బాగా ఉపయోగపడుతున్నది. రైతు పండించిన ప్రతి పంటనూ మార్కెట్లో అమ్ముకునేలా చర్యలు చేపడుతున్నాం. మిగతా మార్కెట్ల కంటే ఇక్కడే మామిడికి మంచి ధర ఇస్తున్నరు.
– కాసర్ల అశోక్బాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, హుస్నాబాద్(సిద్దిపేట జిల్లా)