నేల స్వభావాన్ని బట్టి సాగు చేసుకోవాలి
ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ శ్రీదేవి
సిద్దిపేట అర్బన్, జూన్ 24 : సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని తోర్నాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం యాంత్రిక పద్ధతిలో అధిక సాంద్రత పత్తి సాగుపై ప్రదర్శన నిర్వహించినట్లు ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాంత్రిక పద్ధతిలో అధిక సాంద్రత పత్తి సాగు కోసం ఒక వరుసలో మొక్కల మధ్య దూరం 15 సెం.మీ నుంచి 20 సెం.మీ వరకు వరుసల మధ్య దూరం 60 సెం.మీ నుంచి 90 సెం.మీ వరకు నేల స్వభావాన్ని బట్టి వేసుకోవాలని సూచించారు.
ఎకరం విత్తుకునేందుకు నలుగురు నుంచి ఆరుగురు కూలీలు అవసరం అవుతుందని, కానీ ఈ యంత్రం ద్వారా అరగంటలో వేయవచ్చన్నారు. రోజుకు 9 నుంచి 10 ఎకరాలు విత్తనాలు వేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కోఆర్టినేటర్ విజయ్, శాస్త్రవేత్తలు సాయినాథ్, శ్వేత, సరిత, తోర్నాల గ్రామ రైతులు పాల్గొన్నారు.