నర్సాపూర్, మే12: పెండ్లి ఉన్నదని అమ్మమ్మ ఇంటికి ఆ దంపతులతో కలిసి వెళ్లారు. వేసవి సెలవులు ఉన్నాయని ఆ ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ ఇంటి వద్దనే ఉన్నారు. నర్సాపూర్లో పెళ్లికి వెళ్లి వస్తామని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆ చిన్నారులు వారి కోసం ఎదురుచూస్తున్నారు. అంతలోనే తన అమ్మమ్మకు వచ్చిన ఫోన్తో అందరూ వారిద్దరిని పట్టుకుని ఏడుస్తుంటే ఎం జరిగిందని అమాయకంగా అడుగుతూ కలవరపడ్డారు. అక్కడ నుంచి నర్సాపూర్ దవాఖానకు వచ్చిన తర్వాత తెలిసింది తమను అల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్న ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారని.. తల్లిదండ్రులు మరణవార్త విన్న ఆ చిన్నారుల రోదనలు అందరినీ కలిచివేశాయి. కంట తడి పెట్టించాయి.
చిన్నారులను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. పెళ్లి వేడుకని వెళ్లి రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన నర్సాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. ఎస్సై శివకుమార్ కథనం ప్రకారం.. చిలిపిచెడ్ మండలం రహీంగూడ తండాకు చెందిన నునావత్ రవీందర్ (38) శివంపేట్ మండలంలోని పిల్లుట్ల ప్రాథమిక పాఠశాలలో 8 ఏండ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
శుక్రవారం రహీంగూడ తండా నుంచి తన భార్య అమృత (33)తో కలిసి బైక్పై నర్సాపూర్లో వివాహ వేడుకకు బయలుదేరాడు. మార్గమధ్యలో రెడ్డిపల్లి చౌరస్తా నుంచి సుమారు 200 మీటర్ల దూరానికి రాగానే ఎదురుగా నర్సాపూర్ వైపు నుంచి వస్తున్న టీఎస్ 05 యూఈ 9153 నంబర్ గల డీసీఎం డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తతో రాంగ్రూట్లో నడుపుతూ వచ్చి రవీందర్ బైక్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో రవీందర్ దంపతుల తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులకు కూతురు కృష్ణప్రియ (5వ తరగతి), కుమారుడు సాయిధనుశ్ (3వ తరగతి) ఉన్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం నర్సాపూర్ దవాఖానలోని మార్చురీకి తరలించారు. మృతు డి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరు పిల్లలు అనాథలవడంతో అక్కడున్నవారు కన్నీరుమున్నీర య్యారు. డీసీఎం డ్రైవర్గా సయ్యద్ రియాద్ గ్రామం మెదక్ పట్టణంలోని సుభాశ్నగర్గా తెలిసింది.