సిద్దిపేట, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రైవేట్ దవాఖానలపై రాష్ట్ర ప్రభుత్వం నిఘాను మరింతగా పెంచింది. అనుమతులు లేని దవాఖానలను గుర్తిం చి అధికారులు సీజ్ చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ప్రైవేట్ దవాఖానలకు అనుమతులు ఉన్నాయా? ఎన్నింటికి ఉన్నాయి..? అనుమతులు లేనివెన్ని? సంబంధిత డాక్టర్ ఉన్నాడా? రిజిస్ట్రేషన్ సక్రమంగానే ఉందా? ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని వసతులు ఉన్నాయా? తదితర అంశాలపై ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. రెండు రోజలు నుంచి సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రైవేట్ దవాఖానల్లో ఈ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ప్రతి ప్రైవేట్ దవాఖానకు సంబంధించిన రిపోర్టును సిద్ధం చేస్తున్నా యి. ఈ మధ్య కొంతమంది వచ్చీ రాని వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అలాంటి డాక్టర్ల భరతం పట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొంతమంది ప్రభుత్వ డాక్టర్లు ప్రత్యేక క్ల్లినిక్లు ఏర్పాటు చేసుకుని దానిలోనే సమయం గడుపుతున్నారు. తమ ఉద్యోగ ధర్మాన్ని విస్మరిస్తున్నారు. మరి కొందరు ప్రైవేట్ దవాఖానాల యాజమాన్యాలతో నెలవారి ప్యాకేజీలు మాట్లాడుకుని అందులో వైద్యం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధ్దంగా నడుస్తున్న ప్రైవేట్ దవాఖానలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నది. ఇటీవల జహీరాబాద్, దుబ్బాకలో అధికారులు పలు ప్రైవేట్ దవాఖానలను సీజ్చేశారు.
అసలేం జరుగుతోంది?
ప్రైవేట్ దవాఖానల్లో నిబంధనలకు పాతర వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా ఇష్టారీతిగా గల్లీగల్లీకి ఒక దవాఖాన పుట్టుకొస్తున్నది. ఈ వ్యాపారం లాభసాటిగా ఉండడంతో అందరూ ఆ రంగంలోకి దిగుతున్నారు. రోగంతో సం బంధం లేకుండా ప్రతి దానికి పరీక్షలు, స్కానింగ్లు రాస్తున్నారు. దీంతో వేలాది రూపాయలు గుంజుతున్నారు. ఇలా చేయడంతో ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలకు కాసుల పంట పండుతున్నది. ఎంత లేదన్నా ఒక రోగి ప్రైవేట్ దవాఖానకు వెళ్తే తక్కువలో తక్కువ రూ.5 నుంచి రూ.10 వేలకు వరకు బిల్లు వేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ల్యాబ్లు, మెడికల్ షాపులు అన్ని వారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఈ మధ్య మరో కొత్త ట్రెండ్ మొదలైంది. వైద్యం మీద అనుభవం లేకున్నా ఓ నలుగురైదుగురు కలవడం.. ఓ దవాఖాన ఏర్పాటు చేయడం.. నాలుగు రంగులు, ఓ ఫ్లెక్సీ పెట్టడం.. పేరు ఉన్న డాక్టర్ ఫొటో పెట్టడం.. కొద్ది రోజులు నడపడం.. ఆ తర్వాత అతని స్థానంలో ఏదో ఒక డాక్టర్ను తీసుకొచ్చి దవాఖానను కొనసాగిస్తున్నా రు. ఇలా అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోగులను ప్రైవేట్ దవాఖానల్లో చేర్పించేందుకు కొన్ని దవాఖానలు ఆర్ఎంపీలకు కమీషన్ ఇస్తున్నాయి. టెస్టులు, మందులు, తదితర వాటిల్లో ఆర్ఎంపీలకు అదనపు కమీషన్ అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో 8 బృందాలతో తనిఖీలు..
జిల్లాలో ఎనిమిది ప్రత్యేక బృం దాలు తిరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో అనుమతి పొందినవి 212 దవాఖానల వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా..? లేదా అని చూస్తారు. వైద్యులు, రిజిస్ట్రేషన్ తదితర వాటిని పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది.
– కాశీనాథ్, జిల్లా వైద్యాధికారి సిద్దిపేట